రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ మానవ హారాలు

6 Feb, 2020 13:50 IST|Sakshi

సాక్షి, అమరావతి:  అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహించారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  

విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ ఏయు మెయిన్ గేట్ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు కామనతారావు ఆధ్వర్యంలో విద్యార్ధులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, విశాఖ సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా తయారై రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారని.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే వికేంద్రీకరణ జరగాలని నాయకులు, విద్యార్ధి నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

వైఎస్సార్: జిల్లాలోని అంబెడ్కర్ కూడలి వద్ద ముడవ రోజు  వైఎస్సార్ కాంగ్రెస్ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నయి. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి, సుబ్బమ్మ ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరుగుతున్నాయి.  ‘ఒక రాజదాని వద్దు మూడు రాజధానులు ముద్దు’  అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అడ్డుకున్న వారు చరిత్ర హీనులుగా మారుతారని పలువురు నేతలు హెచ్చరించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా ఆధ్వర్యంలో విద్యార్ధులు మానవహారం చేపట్టారు. శ్రీహరి డిగ్రీ కళాశాల నుండి ఐటీఐ కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది. ఐటీఐ కూడలి లో మానవహారం నిర్వహించిన విద్యార్థులు..  మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు.

కృష్ణాజిల్లా: ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’  అంటూ విస్సన్నపేట పట్టణంలోవిద్యార్ధులు, ప్రజలు పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఈ మానవహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సంఘీభావం తెలిపారు. విజయవాడ గన్నవరం వైఎస్సార్ సీపీ ఇంచార్జి, కేడీసీసీబీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతు ర్యాలీ జరిగింది. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్‌లో పెద్దెఎత్తున మానవహారంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు, విద్యార్ధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడనే నమ్మకంతో  151 సీట్లు ఇచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. గతంలో రెండు లక్షల 20 వేల కోట్లు ఒకేచోట కుప్పపోసి నష్టపోయాయని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదే సీఎం జగన్‌ అన్ని ప్రాంతాలు అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పీఎం జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రజలు నుంచి భారీ మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రకాశం: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు పాల్గొన్నారు.

విజయనగరం: మూడు రాజధానులకు మద్దతుగా విజయనగరం కోట జంక్షన్‌లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ మానవహారంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. 

వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్ధులు శృంగవపుకోట దేవిబొమ్మ కూడలిలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, పినిశెట్టి వెంకటరమణ, రహిమాన్ పాల్గున్నారు.

పాలన వికేంద్రీకరణకు మద్దతుగా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కోట జంక్షన్ నుంచి గంట స్థంభం వరకు కొనసాగిన ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు.

కర్నూలు: అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతుగా, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మానవహరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్థన్ రెడ్డి, యువజన విభాగం నాయకులు అనిల్, కృష్ణకాంత్ రెడ్డి, ఆదిమోహన్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు.


 

>
మరిన్ని వార్తలు