‘దేశం’ గూండాగిరి

14 Jul, 2014 03:21 IST|Sakshi

* గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ తరహా దాడులు
*   ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దారి కాచి దాడులు
*   గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు గాయాలు
*  ఎంపీటీసీలు, బంధువులను కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు
*  నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో తారస్థాయికి అధికార పార్టీ ఆగడాలు
*  నెల్లూరు జిల్లాలో కోరం ఉన్నా... కోరం లేదంటూ ఎన్నిక వాయిదా
*  ఓ జెడ్పీటీసీ సభ్యురాలికి ఎస్పీ బెదిరింపులు.. ఓటేయలేనని వెళ్లిపోయిన సభ్యురాలు
*  సీఎం పేషీ జోక్యంతో ఎన్నికలను వాయిదా వేసిన కలెక్టర్.. పరిశీలకుడి ప్రేక్షక పాత్ర
*  ప్రకాశం జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికకు వెళ్తున్న జెడ్పీటీసీ అరెస్టు
* నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో తారస్థాయికి అధికార పార్టీ ఆగడాలు

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన టీడీపీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బరితెగించారు. తమ పార్టీకి మెజార్టీ లేని జెడ్పీలు, ఎంపీపీలను కూడా చేజిక్కించుకోవడానికి అరాచకాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులను బెదిరించి, ప్రలోభపెట్టి లోబరుచుకునే యత్నం చేస్తున్నారు.  ఆటలు సాగని చోట దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని పేట్రేగిపోతున్నారు. ఈ నెల 5న జరిగిన జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఆగడాలకు కొన్ని స్థానాల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. వాటికి ఆదివారం తిరిగి ఎన్నికలు జరిగాయి. ఈసారి టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. అధికారులు, పోలీసులూ వారికి వత్తాసు పలికారు. దీంతో ఏకంగా భౌతిక దాడులకే టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. గుంటూరు జిల్లాలో ఫ్యాక్షన్ తరహాలోనే వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు కాపు కాసి మరీ దాడులకు దిగాయి. శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు, ఎమ్మెల్యే ముస్తఫా, అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. నలుగురు ఎంపీటీసీలను, వారి బంధువులను కిడ్నాప్ చేశారు. వీరిలో ముగ్గురు మహిళా ఎంపీటీసీలు కూడా ఉన్నారు.

వారిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి తమ వాహనాల్లో పడేసి తీసుకెళ్లారు. వీరిలో ఓ ఎంపీటీసీని సమావేశ మందిరానికి తీసుకొచ్చి, తమ పార్టీ ఎంపీటీసీని అధ్యక్షురాలిని చేసుకోగలిగారు. ఆ తర్వాత ఆ ఎంపీటీసీ ఇంటికెళ్లిపోతానని చెప్పినా వినకుండా వారి వెంటనే తీసుకెళ్లారు. ఈ దాడుల వెనుక శాసన సభ స్పీకర్ కోడెల కుమారుడు శివరామకృష్ణ హస్తముందన్న ఆరోపణలున్నాయి. నెల్లూరులో ఏడుగురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలను లోబరచుకోవడమే కాకుండా, ఎస్పీ చేత ఓ మహిళా జెడ్పీటీసీని బెదిరించారు. దీంతో ఆమె ఓటు వేయలేనని వెళ్లిపోయారు. అయినా సీఎం పేషీ కల్పించుకొంది. ఎస్పీ, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి ఎన్నికలనే వాయిదా వేయించింది. ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు వస్తున్న ఓ జెడ్పీటీసీని పోలీసులతో  అరెస్టు చేయించారు.
 

మరిన్ని వార్తలు