చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..

30 Aug, 2017 12:50 IST|Sakshi
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..

హైదరాబాద్‌ : నంద్యాల  ఉప ఎన్నికను నమునాగా తీసుకుని ముందుకెళ్లాలని ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు  చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి అన్నారు. ఉప ఎన్నిక గెలుపు కోసం టీడీపీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన విమర్శించారు. ఓటరు మెడపై కత్తిపెట్టి, ప్రలోభపెట్టి గెలవడం నమూనా ఎలా అవుతుందని పార్థసారధి సూటిగా ప్రశ్నించారు.

175 నియోజకవర్గాలకు వచ్చే ఎన్నికలలో రూ.35వేల కోట్లు ఖర్చు పెట్టడమే నంద్యాల నమూనా? అని అన్నారు. పెన్షన్లు,రేషన్ రద్దు చేస్తాం అని చెబుతూ చేతిలో 6000 పెట్టి రాష్ట్రమంతా ఓట్లడుగుతారా? రాష్ట్రవ్యాప్తంగా నంద్యాల మోడల్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నలు సంధించారు. నంద్యాల మోడల్‌ 2019 ఎన్నికల్లో టీడీపీని ఇంటికి పంపిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికపై దృష్టి పెట్టారని మండిపడ్డారు.

70వేలమంది ఓటర్లకు సెల్యూట్‌
వైఎస్‌ఆర్‌ సీపీకి ఓటేసిన 70వేలమంది ఓటర్లకు సెల్యూట్‌ చేస్తున్నామని, నంద్యాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చూస్తూ ఊరుకోమని పార్థసారధి హెచ్చరించారు. టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు.