జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే

3 Jul, 2014 02:34 IST|Sakshi
జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే

ఒంగోలు సెంట్రల్ : జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానంతోపాటు గిద్దలూరు, చీరాల మున్సిపాలిటీలను వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకుడు, గుంటూరు అర్బన్ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా జిల్లా నాయకులతో చర్చించడానికి అప్పిరెడ్డి బుధవారం ఒంగోలు వచ్చారు. పార్టీ స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి జిల్లాలో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లతో మాట్లాడారన్నారు.
 
వారందరూ వైఎస్‌ఆర్‌పై అభిమానం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో కొనసాగుతున్నారన్నారు. టీడీపీ నాయకులు గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ నీచానికి ఒడిగుడుతున్నారని చెప్పారు. రేషన్ డీలర్లు, వ్యాపారాలు, నగదు ఇస్తామని అభ్యర్థులకు ఎరవేస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్ సీపీకి విప్ అధికారం ఉందని, దాన్ని ధిక్కరించిన వారిపై అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. 30కి పైగా ఎంపీపీలను పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా రైతు రుణ మాఫీ ఊసే లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తెలివిగా రూణమాఫీని కేంద్రానికి రుద్దాలని చూశారని, తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపిందని చెప్పారు. అధికారాన్ని, పొలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.  ఉద్యమాలు, పోరాటాలతో పుట్టిన వైఎస్‌ఆర్ సీపీ ఇవేమీ చేయలేవన్నారు. గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు, ైవె ఎస్‌ఆర్ సీపీ నాయకుడు వైజా భాస్కర్‌రెడ్డిని ఎస్సై వై శ్రీనివాసరావు తన్నడంతోనే మృతి చెందాడన్నారు. ఈ సంఘటనపై జ్యూడిషియల్ విచారణ నిర్వహించాలని కోరారు. అమాయకుడైన భాస్కర్‌రెడ్డి ప్రాణాలు పోవడానికి కారకుడైన ఎస్సైను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, బుర్రా మధు సూదన్, శింగరాజు వెంకట్రావు, నాగిరెడ్డి, శంకర్, ఎ. ఆంజనేయులు, కె.వి. రమణా రెడ్డి, కె.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
 వైఎస్‌ఆర్ సీపీ విప్‌ల జారీ
 ఒంగోలు అర్బన్ : స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో వైఎస్‌ఆర్ సీపీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లకు విప్ ఇవ్వాలని ఆ పార్టీ ఎన్నికల పరిశీలకుడు అప్పిరెడ్డి జిల్లా నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు. జిల్లాకు సంబంధించి విప్‌లు జారీ చేసే అధికారం పార్టీ మాజీ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డికి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించారని చెప్పారు. ఆయన ఆదేశానుసారం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు విప్‌లు అందచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ వై. నాగిరెడ్డి, దూళిపూడి ప్రసాద్ పాల్గొన్నారు.
 
ఎస్సై ప్రవర్తన ప్రజాస్వామ్యానికే మచ్చ
గిద్దలూరు రూరల్ : గిద్దలూరు ఎస్సై వై.శ్రీనివాసరావు ప్రవర్తన ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని వైఎస్‌ఆర్ సీపీ నగర పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకుడు అప్పిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గృహానికి బుధవారం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయం చేయాలని కోరినందుకు ఎస్సై దురుసుగా ప్రవర్తించడమే కాక నెట్టడంతో మరణించిన వైజా భాస్కర్‌రెడ్డి లోటు పార్టీకి పూడ్చలేనిదన్నారు. ఆయన మృతికి కారకుడైన ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామన్నారు.
 
భాస్కరరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తొలుత మృతుడు భాస్కర్‌రెడ్డి గృహానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఆంజనేయులు, ట్రేడ్ యూనియన్ నాయకులు కేవీ ప్రసాద్, యువజన విభాగం అధ్యక్షుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, నాయకులు యేలం వెంకటేశ్వరరావు, కే రమణారెడ్డి, పీ వెంకటరాజుయాదవ్, నారు అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు