టీటీడీ అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డితో సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి భేటీ
మణిమంజరి అతిథి గృహంలో చోరీని త్వరగా ఛేదించాలని ఆదేశం
సాక్షి, విజయవాడ : కొండపై శ్రీవారి భక్తులకు రక్షణ కరవైతే మీరంతా ఏం చేస్తున్నట్టని టీటీడీ అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపీనాథ్ జెట్టి కలిశారు. రెండు రోజుల క్రితం తిరుమలలో విజిలెన్స్ సిబ్బందితో సమీక్షలో గోపీనాథ్ లేరు. అక్కడ చర్చించిన అంశాలపై సమీక్షించారు. భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని సుబ్బారెడ్డి ఆదేశించారు.
ఇటీవల మణిమంజరి అతిథిగృహంలో చోరీ జరిగిన ఘటనపై విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగారు. వీలైనంత త్వరగా సొత్తును రికవరీ చేయాలని కోరారు. తిరుమలలో వితరణ ఇచ్చిన అతిథిగృహాలకు ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వారే సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. అంతే కాకుండా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను కూడా నియమించే అంశాన్ని పరిశీలించాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సుబ్బారెడ్డి కోరారు.