22 నుంచి వైవీయూ సెట్‌ కౌన్సెలింగ్‌

21 Jun, 2018 08:18 IST|Sakshi

సాక్షి, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాల, అనుబంధ కళాశాలల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వైవీయూ సెట్‌–2018 ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య టి.శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ అర్హతకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు, హాల్‌టికెట్, ర్యాంకుకార్డు, ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకుని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.


జూన్‌ 22న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌సైన్సెస్, తెలుగు, ఉర్దూ కోర్సులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్‌సైన్స్, ఆంగ్లం, జియాలజీ, పీజీ డిప్లొమో ఇన్‌ థియేటర్‌ ఆర్ట్స్, ఫైన్‌ఆర్ట్స్, ఫుడ్‌ టెక్నాలజీ, కంప్యూటేషనల్‌ డేటా సైన్స్‌కు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.


23న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కామర్స్‌ కోర్సులకు సంబంధించి 1 నుంచి 450వ ర్యాంకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 450పైన ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు, భౌతికశాస్త్రం, మెటీరియల్‌సైన్స్‌ నానోటెక్నాలజీ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, ఎడ్యుకేషన్‌ కోర్సుకు సంబంధించిన అన్ని ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు వివరించారు.


24న ఉదయం 9 నుంచి 1 గంట వరకు గణితం, స్టాటిస్టిక్స్, జనరల్‌ టెస్ట్‌లో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రసాయనశాస్త్రం, పర్యావరణశాస్త్రం, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్‌ కోర్సుల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు.   

మరిన్ని వార్తలు