గురితప్పిన విలువిద్య

10 Feb, 2015 00:54 IST|Sakshi
గురితప్పిన విలువిద్య

{పతిభ చాటుతున్నా.. {పోత్సాహం కరవు
పాడేరు కేంద్రంలో శిక్షణ నామమాత్రం
కానరాని శిక్షకులు.. {పత్యేక ఆహారం ఉత్తిదే

 
ఏజెన్సీలోని గిరిజనులంతా శక్తిమంతులు. పూర్వం నుంచి అడవుల్లో వేటే ప్రధానంగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు విల్లుతో కొట్టడం వెన్నతో పెట్టిన విద్య. చిన్నతనం నుంచే బాణాలతో గురిపెట్టి పక్షులను, వన్యప్రాణులను వేటాడడం గురువులు లేకుండానే అబ్బింది. సంప్రదాయ విల్లంబులతో సంచరించే గిరిజనులకు ఇది ఓ వరంగా మారింది. ఏజెన్సీవ్యాప్తంగా అనేక మంది గిరిజన విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఓ వైపు చదువుతూనే విలువిద్యలో రాణిస్తున్నారు.
 
పాడేరు: స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను బాణం, విల్లులతో గడగడలాడించిన చరిత్ర ఉన్న మన్యం వాసులు చిన్నప్పటి నుంచే విలువిద్యపట్ల అమితాసక్తి కనబరుస్తారు. విలువిద్యలో సత్తా చూపే శక్తి గిరిజన యువతలో ఉంది. గిరిజన బాలికలు కూడా బాలురతోపాటు ఇందులో రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధిస్తూ విశాఖ ఏజె న్సీకి గుర్తింపు తెస్తున్నారు. ఇప్పటికే పాడేరుకు చెందిన జి.బైరాగి నాయుడు విలువిద్యలో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. జూనియర్ నేషనల్‌లో ఒక గోల్డ్, సీనియర్ నేషనల్‌లో ఒక గోల్డ్, రాష్ట్రస్థాయి పోటీల్లో 10 బంగారు పతకాలు సాధించి సత్తా చూపాడు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు లేనప్పటికి బైరాగి నాయుడు ఇటీవల కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించి విశాఖ ఏజెన్సీ కీర్తిని జాతీయస్థాయిలో చాటాడు. విలువిద్యలో గిరిజనులకు ఎవరూ సాటిరారంటూ చెప్పాడు. పాడేరు ప్రాంతంలోని సీఏహెచ్‌స్కూల్, ప్రైవేటు భారతీయ విద్యాకేంద్రంలో చదువుతున్న గిరిజన విద్యార్థులు కూడా 14 ఏళ్లలోపు విభాగంలోనే రాష్ట్ర, జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టిస్తున్నారు.

19 ఏళ్లలోపు విభాగంలో ప్రస్తుతం జాతీయ క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన బైరాగి నాయుడుతోపాటు ఎస్.రాజుబాబు, సుధాకర్ నాయుడు, ఎస్‌ఆర్‌కె కొండలరావు, ఎస్.సంతోష్, ఎన్.వెంకటరావులు కూడా విలువిద్యలో చక్కని క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. అలాగే 14 ఏళ్లలోపు విభాగంలో సీఏహెచ్ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఎస్.రమేష్ ఇప్పటికి రాష్ట్ర, జాతీయ పోటీల్లో 10 బంగారు పతకాలు సాధించి విలువిద్యలో సత్తా చాటుతున్నాడు. అదే పాఠశాలకు చెందిన ఎస్.లక్ష్మణరావు, జి.మహేష్‌బాబు, ఎ.బాబూరావు, ఎస్.సాంబశివలు కూడా విలువిద్యను అలవర్చుకున్నారు. భారతీయ విద్యా కేంద్రానికి సంబంధించి 8వ తరగతి చదువుతున్న కృష్ణసాయి విలువిద్య పోటీల్లో పలు బంగారు పతకాలు సాధించగా, టి.లత, బి.మౌనిక, వంశీకృష్ణ, సుబ్బారావు, కె.అప్పారావు, గణపతి అనే గిరిజన విద్యార్థులు కూడా రాణిస్తున్నారు.

అంతర్జాతీయ విల్లులు లేవు

విలువిద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే బౌలు (విల్లులు) కూడా కరువయ్యాయి. తక్కువ ధరలకు రూ.5 వేలు లోపు లభ్యమయ్యే ఇండియన్ స్టాండ ర్డ్ బౌలతోనే గిరిజన క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. మూడేళ్ల క్రితం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పని చేసిన కె.శ్రీకాంత్ ప్రభాకర్ 4 బౌలను ఒకొక్కటి రూ.1.7లక్షలు విలువైన అంతర్జాతీయ బౌలను కొనిపెట్టి స్థానిక ఐటీడీఏ శిక్షణ అకాడమీకి ఇచ్చారు. ప్రస్తుతం అవికూడా పాతబడటంతో శిక్షణకు ఇబ్బందిగా మారింది. తర్వాత వచ్చిన ఐటీడీఏ అధికారులు ఎవరూ ఆర్చరీ అకాడమీలో పూర్తిస్థాయి సౌకర్యాలు, విలువిద్యశిక్షణకు సంబంధించిన అధునాతన విల్లులు కూడా అందుబాటులోకి తేలేదు. పేరుకే ఐటీడీఏ ఆర్చరీ అకాడమీ ఉన్నప్పటికి ప్రత్యేక శిక్షకుడు కరువవ్వడంతో శిక్షణ పొందే విద్యార్థులు, గిరిజన యువకులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం కూడా కరువైంది. విలువిద్య పోటీలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అర్హత పొందుతున్న గిరిజన విద్యార్థులు, యువకులకు కూడా తగిన ప్రోత్సాహం కరువైంది. ప్రస్తుతం జాతీయ క్రీడాపోటీల్లో స్వర్ణపతకం సాధించిన జి.బైరాగి నాయుడు కూడా శిక్షణకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. స్థానికంగా ఐటీడీఏ ఆర్చరీ అకాడమీలో సౌకర్యాలు లేకపోవడంతో విజయవాడలోని నోవా ఆర్చరీ అకాడమీలో రెండు నెలలుపాటు శిక్షణ పొంది ఈ జాతీయ పోటీలకు మంచి నైపుణ్యాన్ని సాధించాడు. పాడేరులోని ఐటీడీఏ శిక్షణ కేంద్రంపై ఆధారపడితే ఈ స్వర్ణ పతకం వచ్చేది కాదంటూ పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
 
ప్రత్యేక శిక్షణ, సౌకర్యాలు కరవు

 
విలువిద్యలో గిరిజన విద్యార్థులు, యువకులకు సత్తా ఉన్నప్పటికి సౌకర్యాలు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూనే పూర్తిస్థాయిలో క్రీడాపోటీల్లో రాణించ లేకపోతున్నారు. పాడేరు ఐటీడీఏ మూడేళ్ల క్రితం తలారిసింగి మినీ స్టేడియం వద్ద ఆర్చరీ అకాడమీని ఏర్పాటు చేసినప్పటికి శిక్షణ పొందుతున్న ఆర్చరీ క్రీడాకారులకు మాత్రం పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించ లేదు. శిక్షణ పొందుతున్న యువతకు పౌష్టికాహారం పంపిణీతోపాటు ప్రత్యేక శిక్షకుడిని కూడా నియమించకపోవడంతో స్థానిక పీఈటీలే తమకున్న పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తున్నారు.
 
నాణ్యమైన ఆహారం లేదు

పాడేరు ఆర్చరీ అకాడమీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆహారం కూడా కరువైంది. శిక్షణ సమయంలో నాణ్యమైన ఆహారం తీసుకుంటేనే క్రీడాకారులు ఆరోగ్యకరంగా ఉంటారు. నేను హాస్టల్‌లో సాధారణ అన్నం తిని అనారోగ్యం పాలయ్యాను. శిక్షణ పొందే వారికి ప్రత్యేక డైట్‌ను అమలు చేయాలి.
 -జి.బైరాగి నాయుడు, స్వర్ణ పతకం విజేత, పాడేరు.
 
సౌకర్యాలు కల్పించాలి

ఐటీడీఏ ఆర్చరీ అకాడమీలో సౌకర్యాలు లేకపోవడంతో శిక్షణ పొందేందుకు ఆశక్తి చూపని పరిస్థితి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి శిక్షణ పొందేందుకు వస్తున్నప్పటికి ఒకటి, రెండు రోజు ల్లోనే వెళ్లిపోతున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే విలువిద్యలో మరింత రాణిస్తాం.
 -ఎస్.రమేష్, విలువిద్య క్రీడాకారుడు,
 పాడేరు సీఏహెచ్ స్కూల్.
 
 స్థానికంగానే శిక్షణ


బీవీకే పాఠశాలకు అనుబంధంగా ఉన్న వంతాడపల్లి ఆశ్రమం వద్ద స్థానికంగా శిక్షణ పొందుతున్నాం. అం తర్జాతీయ స్థాయిలో రాణిం చే విధంగా సౌకర్యాలు కల్పించాలి. ప్రత్యేక బౌలు కూడా లేకపోవడంతో శిక్షణకు ఇబ్బందిగా ఉంది.
 -కృష్ణసాయి, బంగారు పతకం విజేత,
 బీవీకే స్కూల్,పాడేరు.
 
అకాడమీలో పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలి

పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్చ రీ అకాడమీ ద్వారా పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రత్యేక శిక్షకులు లేకపోవడంతో శిక్షణకు ఇబ్బందులు పడుతున్నాం. నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా విలువిద్యలో రాణించగలం.
 -టి.లత, విలువిద్య క్రీడాకారిణి,
 బీవీకే పాఠశాల, పాడేరు.
 
 

మరిన్ని వార్తలు