జెడ్పీ పీడీ ఖాతాలో నిధులు మాయం
సీఎఫ్ఎంఎస్లో కనిపించని రూ. 412 కోట్లు
నెల రోజులవుతున్నా చక్కబడని పరిస్థితి
నిలిచిపోయిన బిల్లులు.. చెల్లింపులు
నిధులు పక్కదారి మళ్లాయని ఆందోళన
నిధుల్లేక అప్పులు చేస్తున్న ఉద్యోగులు
నెలరోజులుగా జిల్లా పరిషత్లో పైసా లేదు. ఉద్యోగులు నెలనెలా దాచుకునే సొమ్ము కనిపించకుండాపోయింది. సర్కారు ఈ సొమ్మును పక్కదారి పట్టించి తమకు అనుకూల పథకాలకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాచుకున్న సొమ్ము మాయమవ్వడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైనా అవసరాలకు ఉపయోగపడతాయని దాచుకున్న సొమ్మును సర్కారు స్వప్రయోజనాలకు కేటాయించిందని వీరు మండిపడుతున్నారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్(జెడ్పీ) పరిధిలో దాదాపు 9 వేలమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. వారి జీతాల నుంచి నెలనెలా దాచుకున్న కోట్లాది రూపాయలు పీడీ(పర్సనల్ డిపాజిట్) ఖాతా నుంచి అదృశ్యమయ్యాయి. దీంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెడ్పీ పరిధిలోని అధికారులతోపాటు ఎంపీడీవో, పీఆర్, ఆర్డబ్లూఎస్ ఇంజినీరింగ్ విభాగంలోని మినిస్ట్రియల్ ఉద్యోగులు, జెడ్పీ, మండల పరిషత్తు పాఠశాల ఉపాధ్యాయులు, ఆïఫీస్ సిబ్బంది జీతం నుంచి ప్రతి నెలా కొంత సొమ్ము పర్సనల్ డిపాజిట్(పీడీ) ఖాతాలో జమ చేస్తుంటారు. ఇలా ఈ ఖాతాలో దాదాపు రూ. 412 కోట్లు గత నెల 28 వరకు భద్రంగా ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్(సమగ్ర ఆర్థిక నిర్వాహణ విధానం కింద కాంప్రెహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిధులు కనిపించాయని జెడ్పీ ఉద్యోగుల ద్వారా తెలిసింది. తర్వాత నుంచి సీఎఫ్ఎంఎస్లో జెడ్పీ పీడీ ఖాతాలోని నిధులు మొత్తం కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా వివిధశాఖల్లో పనిచేçస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఈనెలకు వారు దాచుకున్న రూ. రూ.5.60 కోట్లు మాత్రమే సీఎప్ఎంఎస్లో కనిపిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సొమ్మును వేరే కార్యక్రమాలకు మళ్లించినట్లు చర్చసాగుతోంది.
సొమ్ము లేక ఆగిన రుణాలు
జిల్లావ్యాప్తంగా 250 నుంచి 270 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పలు అవసరాల కోసం పీఎఫ్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. జెడ్పీ ఖాతాలో సొమ్ములేక పోవడం వల్ల వారందరికి పీఎఫ్ రుణాలు చెల్లించేందుకు అవకాశం లేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రూ. 10 కోట్ల మేర ఇలా రుణ దరఖాస్తుదారులకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగం చేస్తూ ఇటీవల రిటైరైన వారికి కూడా ఒక్క రూపాయి చెల్లించలేదు. విశ్రాంత జీవితం వేళ ఏమిటీ ఆందోళన అని వారంతా దిగులు పడుతున్నారు. పదవీ విరమణ తరువాత డబ్బులు వస్తాయని రకరకాల కేటాయింపులను వారంతా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు వారికి నిరాశే మిగిలింది. జిల్లావ్యాప్తంగా 60 నుంచి 70 మందిదాకా రిటైరైన వారు ఉన్నారు. వీరందరికి రూ.14 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. సుండుపల్లె మండలం పింఛా జెడ్పీ హైస్కూల్లో టైపిస్టుగా పనిచేసిన ఓ మహిళ గతేడాది ఆగస్టులో ఉద్యోగ విరమణచేశారు. ఆమెకు ఇప్పటివరకు సెటిల్మెంట్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దాదాపు రూ.9 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉందని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా రిటైరైన ఉద్యోగులందరి వేదన ఇలానే ఉంది.
పీఎఫ్ డబ్బును వాడుకోవడం దారుణం...
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవడం దారుణం, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, వివాహాలు, ఇళ్లు, స్థలాల కొనుగోలు వంటి అవసరాల కోసం దాచుకున్న పొదుపు సొమ్మును ప్రభుత్వం వాడుకోవడం మంచిది కాదు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆందోళన కార్యక్రమాలను చేపడతాం. – రెడ్డెప్పరెడ్డి, వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
నెలల నుంచి ఎదురు చూపు
జిల్లావ్యాప్తంగా రిటైరైన చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తుది చెల్లింపుల కోసం నెలల తరబడి చూస్తున్నారు. జెడ్పీ పీడీ ఖాతా నుంచి డబ్బులు పోవడం చాలా దారుణం. రిటైరయ్యాక సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయం. అధికారుల తక్షణం స్పందించి వారికి న్యాయం చేయాలి. – కంభం బాలగంగిరెడ్డి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి.
గత నెలలో జమైన డబ్బులతో బిల్లులు చెల్లింపు
పీఎఫ్కు సంబంధించి ఏప్రిల్లో రూ.5.96 కోట్లు జమ అయ్యింది. 124 మందిఉద్యోగ, ఉపాధ్యాయుల రుణాల కోసం రూ.4 కోట్లకు బిల్లులు పెట్టాం. త్వరలో చెల్లిస్తాం. – వెంకట ప్రసాద్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ,
ఆందోళన అవసరం లేదు
జెడ్పీ పీడీ ఖాతాలో రూ.412 కోట్లు ఉన్నట్లుగా కనిపించకపోవడం గురించి ఆందోళన వద్దు. ïసీఎఫ్ఎంఎస్తో కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు రుణాల కోసం దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. డబ్బులు రాగానే అన్నీ చెల్లిస్తాం. – నగేష్, జెడ్పీ సీఈఓ.
తక్షణం జమ చేయాలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఎఫ్ డబ్బులను ఖాతాల నుంచి ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం సరైందికాదు. ప్రస్తుతం పిల్లలను కళాశాలల్లో, స్కూల్స్లో చేర్చుకునే సమయం. ఇప్పుడు ఇలా చేయడం ఏం బాగాలేదు. ప్రభుత్వం స్పందించి ఫీఎఫ్ డబ్బులను వెంటనే ఖాతాలకు జమచేయాలి. – లంకా మల్లేశ్వరెడ్డి, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.