అవినీతి మత్తు వీడాల్సిందే..

23 Jul, 2019 08:39 IST|Sakshi
శోభారాణి వద్ద వివరాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులు

లేదంటే తప్పదు మూల్యం

పీఆర్‌ సూపరింటెండెంటే ఉదాహరణ

చేయి తడిపితేనే... చెక్కు!

సాక్షి, శ్రీకాకుళం: ‘అవినీతిని సహించేది లేదు... స్వచ్ఛమైన పాలన అందిద్దాం... ఇబ్బందులుంటే చెప్పండి... మీ సమస్యలను నేను చూసుకుంటాను... లంచాల జాడ్యం ఉండకూడదు.’ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు పదేపదే ఇవే మాటలు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా మన అధికారులు, ఉద్యోగుల్లో కొందరికి చెవికెక్కడం లేదు. చేయి తడిపితేనే ఫైలు కదుపుతున్నారు... ముడుపులు ముట్ట జెబితేనే ప్రొసీడింగ్స్‌ ఇస్తామంటున్నారు. అవినీతి రహిత పాలనలో భాగంగా ఇప్పటికే నిఘా ఎక్కువైంది. ఆరోపణలు వస్తేనే సీరియస్‌గా తీసుకునే పరిస్థితుల్లో ఏకంగా లంచమే తీసుకుంటే ఊరుకుంటారా? ఇప్పుడదే జరిగింది. బదిలీ ప్రొసీడింగ్స్‌ కోసం తోటి ఉద్యోగి వద్ద నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ సూపరింటెండెంట్‌ శోభారాణి ఏసీబీకి చిక్కారు.

అవినీతి జాడ్యం
జిల్లాలో రెవెన్యూ, పోలీసు తదితర శాఖల తర్వాత ప్రధానంగా చెప్పాల్సింది పంచాయతీరాజ్‌ శాఖ గురించే...! గ్రామీణాభివృద్ధితోపాటు వివిధ రకాల పనుల కోసం కాంట్రాక్టర్లు... ఉద్యోగులు... రాజకీయ నేతలు నిత్యం క్యూ కట్టే కీలక శాఖ ఇది. ఇంజినీరింగ్‌ విభాగం అందులో ప్రత్యేకం. ఇక్కడొక సంప్రదాయం కొనసాగుతున్నది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసుంటుంది. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి వరకు లంచాలు, పర్సంటేజిల విషయంలో ఏమాత్రం తగ్గరన్న సంగతి సుస్పష్టం. ఇక ప్రధాన కార్యాలయాల్లో సీటు సీటుకు ఒక రేటు కూడా ఉంటుంది. ఇలా శాంతి చేస్తేనే.. పనులకు ఆమోదం దొరుకుతుం ది. చేయి తడిపితేనే.. చెక్కు పాసవుతుంది.

జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని జిల్లా పరిషత్‌ పరిపాలన కార్యాలయం, ఇంజినీరింగ్‌ విభాగం (పిఆర్‌ఐ, పిఐయు)తో పాటు పంచాయతీ విభాగం, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాలుంటాయి. వీటిల్లో అత్యధికంగా అభివృద్ధి పనులు, నిర్మాణాలు, మరమ్మతులు, రహదారులు, వంతెనలు, తుఫాన్‌ షెల్టర్లు.. ఇలా ఒకటేమిటి.. వేలాది పనులు ప్రగతిలో ఉన్నాయి. జిల్లాలో ఉన్న 38 మండలాల్లో 1141 గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా పనులు జరిగే ఈ విభాగంలో కొందరు ఉద్దండులు బాగా దండుకునేందుకు ఏరికోరి జిల్లా కేంద్రంలోని పీఆర్‌ ఇంజినీరింగ్‌లో విధుల ను ఎంచుకుంటారు.

ఇందుకోసం రాజధానిలోని ఇఎన్‌సి కార్యాలయంలో కొందరితో తగిన ఏర్పాట్లు ఉండనే ఉంటాయి. అందుకే ‘కావాల్సిన పని కోసం.. కోరుకున్నది ఇవ్వాల్సిందే’ అన్న సూత్రాలు ఇక్కడ బాగా పనిచేస్తాయి. రాజధానిలో లైటు వెలుగు కోసం సిక్కోలులో స్విచ్‌ వేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ లంచాలు ఇస్తే... అక్కడ పనులు ఆగమేఘాల మీద జరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే దొరికితేనే దొంగ అన్నట్టుగా వ్యవహారం నడిచిపోతున్నది.

ప్రతి పనికీ..లంచమే..!
పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో వేలాది పనులతోపాటు వందలాది మంది ఉద్యోగుల పరిపాలన, బదిలీలు, పదోన్నతులు ఇతరత్రా విషయాల్లో ప్రతి పనికి లంచాలను ఇచ్చుకోవాల్సిందే. సకాలంలో నిబంధనల ప్రకారం పదోన్నతి రావాలన్నా... కోరుకున్న చోటుకు బదిలీ కావాల న్నా... ముందే మాట్లాడిన రేటు ప్రకారం ముట్టజెప్పాల్సిందే.. అలాగే పనులకు సంబంధించి కూడా లక్షకో రేటు.. కోటికో రేటు.. పర్సంటేజిలు చొప్పున ఇచ్చుకోవాల్సిందే.. ఉన్నతాధికారి సంతకం జరగాలంటే.. ముందున్న లంచాల కోటలు దాటాల్సిందే.. తాజాగా విశాఖ జిల్లాలో బదిలీ జరిగిన ఓ ఉద్యోగికి బదిలీ స్థానానికి ప్రొసీడింగ్స్‌ ఉత్తర్వుల కోసం లంచం డిమాండ్‌ చేయగా, స్థానిక సూపరింటెండెంట్‌ శోభారాణి ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో జిల్లా పరిషత్‌ ఉలిక్కిపడింది.

ఆమె తీరుపై శాఖలో విస్తృత చర్చ
ఏసీబీకి పట్టుబడటమే తరువాయి ఆమె తీరుపై శాఖలో విస్తృత చర్చ నడిచింది. ఏమాత్రం మొహమాటం పడకుండా, కావల్సింది ముక్కు పిండి వసూలు చేస్తారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. చేయి తడిపితే తప్ప ఫైలు కదపరని, ప్రొసీడింగ్స్‌ కోసం లంచం అలవాటుగా మారిపోయిందని, పదోన్నతులు, బదిలీలు కల్పిస్తానంటూ చేతివాటం ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు. ఇటీవల తోటి సిబ్బంది సూచనప్రాయంగా హెచ్చరిక చేసినా పట్టించుకోలేదని చర్చించుకుంటున్నారు. చెప్పినది చెవికెక్కించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పెదవి విరుస్తున్నారు.

మారకపోతే తప్పదు మూల్యం
పరిస్థితులు మారాయి. ప్రజల్లో చైతన్యం పెరిగిపోయింది. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా ఫోన్‌ చేయాలని ఏకంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డే చెబుతున్నారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదంటున్నారు. ఈ నేపథ్యంలో మార్పు రావల్సిన అవసరం ఉంది. అవినీతి రహిత పాలనకు సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంత గట్టిగా చెప్పినా మార్పు రాకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు. అందుకు సూపరింటెండెంట్‌ వ్యవహారమే ఉదాహరణగా తీసుకోవచ్చు.

లంచాలు అక్కడ మామూలే..
జెడ్పీ పరిధిలోని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పంచాయతీరాజ్‌ ఇనిస్టిట్యూషన్స్, ప్రాజెక్ట్స్‌ ఇంప్లిమెంటింగ్‌ యూనిట్, సూపరింటెం డెంగ్‌ ఇంజినీర్‌ కార్యాలయాల్లో వివిధ రకాల పనులకు వివిధ రకాల ఆమోదాలు అవసరమవుతుంటాయి. ఇందుకోసం ప్రతి పనికి పీస్‌ రేట్‌ సమర్పించుకోవాల్సిందే.. గత కొన్నేళ్లుగా అంతా చూస్తున్నదే. లంచం రకరకాలుగా చేతులు మారుతుంటాయి.

మరిన్ని వార్తలు