జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్‌లు ఖరారు!

5 Mar, 2014 23:44 IST|Sakshi

 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్:  ఈ ఎన్నికల సీజన్‌లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికేసాధారణ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రభుత్వం తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ గురువారం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి జిల్లా పరిషత్ అధికారులు కసరత్తు పూర్తి చేసి ఆమోదం కోసం కలెక్టర్‌కు పంపినట్లు సమాచారం. కలెక్టర్ ఆమోదముద్ర వేసిన వెంటనే గురువారం రిజర్వేషన్ల జాబితాను జెడ్పీ అధికారులు ప్రకటించనున్నారు.

 ఎన్నికలకు సర్వం సిద్ధం కానీ...
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ అధికారులు ఇది వరకే పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయటంతోపాటు ఓటర్ల జాబితాను ప్రభుత్వానికి అందజేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్‌లు ఖరారు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువరించవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మున్సిపల్, సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నందున జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రభుత్వం ఇప్పుడే నిర్వహించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 గత రిజర్వేషన్లు రద్దు... తాజా రిజర్వేషన్లు ఖరారు
 జిల్లాలో 2006 జూన్‌తో జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదివీ కాలం ముగిసింది. అప్పటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పునర్విభజన చేపట్టారు. జనాభాతో పాటు ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అధికారులు, 2013 ఆగస్టులో పునర్విభ జన ప్రక్రియ పూర్తి చేశారు. కొత్త పునర్విభజన ప్రకారం జెడ్పీ స్థానాలు గతంలో లాగా 46 ఉండగా, ఎంపీటీసీ స్థానాల సంఖ్య మంత్రి 664 నుంచి 685కు పెరిగింది.

 19 జెడ్పీటీసీ స్థానాలు బీసీలకు
 2011 జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా అధికారులు రిజర్వేషన్‌లు సిద్ధం చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు రిజర్వు చేసినందున ఆ మేరకు రిజర్వేషన్లలో మహిళలకు స్థానాలకు కేటాయించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 15 జనరల్, 19 బీసీలకు, 9 ఎస్సీలకు, 3 ఎస్టీలకు అధికాలు రిజర్వు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 685 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వీటిలో జనరల్ కేటగిరిలో 233, బీసీ కేటగిరిలో 278, ఎస్సీ 132, ఎస్టీ 42 రిజర్వు అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు