ఐశ్వర్య రాయ్‌ నా కన్నతల్లి : విశాఖ కుర్రాడు!

3 Jan, 2018 11:46 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్ తన అందం, అభినయంతో భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు‌. ప్రపంచ సుందరి కిరీటం కైవసం చేసుకున్న దగ్గరి నుంచి సినిమా రంగ ప్రవేశం, పెళ్లికి ముందు అఫైర్లంటూ రూమర్స్, అభిషేక్ బచ్చన్తో వివాహం, కూతురు ఆరాధ్య, పెళ్లి అనంతరం తిరిగి సినీ రంగ ప్రవేశం ఇలా ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్తో వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాత్రం ఐష్ అభిమానులకు నవ్వు తెప్పించే ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. విశాఖ యువకుడిగా చెప్పుకుంటున్న ఓ 29 ఏళ్ల కుర్రాడు సంగీత్ కుమార్ ఐశ్వర్య తన తల్లి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి ఓ వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.  

సంగీత్ కుమార్ ఆ వీడియోలో ఏంచెప్పాడంటే.. 'నేను ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ద్వారా 1988లో లండన్లో జన్మించా. ఐశ్వర్య తల్లిదండ్రులు కృష్ణరాజ్‌ రాయ్‌, వ్రిందా రాయ్లు రెండేళ్లపాటూ నన్ను పెంచారు. నా తండ్రి అడివేలు రెడ్డి తర్వాత నన్ను విశాఖపట్నం తీసుకువచ్చారు. అప్పటి నుంచి విశాఖలోనే ఉండాల్సి వచ్చింది. నా తల్లి నుంచి దూరమై ఇప్పటికి 27 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నా తల్లితో ఉండాలనుకుంటున్నా. ఐష్ నా తల్లి అని నిరూపించడానికి నా దగ్గర ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. ఆ డాక్యుమెంట్లను నా కుటుంబ సభ్యులు నాశనం చేశారు' అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఇప్పుడు ఐష్, అభిషేక్లు కలిసి ఉండటం లేదట. వారిద్దరూ సెపరేట్ అయ్యారంటూ మరో బాంబు పేల్చాడు. ఈ కుర్రాడి వ్యాఖ్యలను ఐష్ అభిషేక్లు వింటే ఎలా స్పందిస్తారో చూడాలి.
 

మరిన్ని వార్తలు