హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త మోడళ్లతో రంగంలోకి దిగుతోంది. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్పోలో 26 నూతన వాహనాలను ప్రదర్శించనుంది. వీటిలో 14 వాణిజ్య, 12 ప్యాసింజర్ వెహికల్స్ ఉండబోతున్నాయి. ఎక్స్పో వేదికగా అంతర్జాతీయ విపణిలోకి కంపెనీ నాలుగు వాహనాలను ఆవిష్కరిస్తుంది. భారత్లో వచ్చే మూడు నాలుగేళ్లలో 12–14 సరికొత్త కార్లు రోడ్డెక్కనున్నాయి.
ఆల్ఫా, ఒమేగా ప్లాట్ఫామ్స్పై కొత్త ప్యాసింజర్ కార్లు రూపుదిద్దుకుంటాయని టాటా మోటార్స్ గ్లోబల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ బోస్ శుక్రవారం వెల్లడించారు. ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆల్ట్రోజ్ కారును ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆల్ఫా ఆర్కిటెక్చర్పై తయారైన తొలి కారు ఆల్ట్రోజ్ అని చెప్పారు. నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఈ నెల 28న విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఏడు సీట్లతో రూపుదిద్దుకున్న గ్రావిటాస్ ఎస్యూవీ త్వరలో రానుందన్నారు.
ఆల్ట్రోజ్ కారుతో ప్రతాప్ బోస్, రీజినల్ హెడ్ నిథున్ శర్మ (కుడి)