వావ్.. షో!

8 Feb, 2018 01:01 IST|Sakshi

కార్ల పండుగ మొదలైంది. 14వ ఆటోఎక్స్‌పో గురువారం మధ్యాహ్నం గ్రేటర్‌ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో అధికారికంగా ప్రారంభమౌతుంది. అయితే మీడియా, కార్పొరేట్‌ ప్రతినిధులకు బుధవారం నుంచి అనుమతించారు. ప్రజలకు 914 వరకు అందుబాటులో ఉంటుంది.వాహన విడిభాగాల తయారీ కంపెనీల సంఘం(ఏసీఎంఏ), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), వాహన తయారీ కంపెనీల సంఘం (సియామ్‌) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈసారి షోలో కంపెనీలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పర్యావరణ అనుకూల టెకాల్నజీలకు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. దేశీ, విదేశీ కంపెనీలు వాటి ప్రొడక్టులను, భవిష్యత్‌ ప్రణాళికలను ఆవిష్కరించాయి.

మారుతీ సుజుకీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కాన్సెప్ట్‌ కాంపాక్ట్‌ కారు ఆవిష్కరించింది. దీని పేరు కాన్సెప్ట్‌ ప్యూచర్‌ ఎస్‌. ఇందులో ఎస్‌యూవీ ప్రత్యేకతలు ఉండటం విశేషం. కంపెనీ అలాగే ఈవీ కాన్సెప్ట్‌ ‘సర్వైవర్‌’ కారును కూడా  ప్రదర్శించింది. ‘2020 నాటికి బీఎస్‌–6 ప్రమాణాలకు అనువైన ప్రొడక్టులను తయారుచేస్తాం. 2020లోనే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువస్తాం. వీటిని దేశీయంగానే రూపొందిస్తాం’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు.   

హోండా: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ మూడు కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఆల్‌ న్యూ అమేజ్, సీఆర్‌–వీ, సివిక్‌ సెడాన్‌ అనేవి ఇందులో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఆరు మోడళ్లను భారత్‌ మార్కెట్‌లోకి తెస్తామని కంపెనీ ప్రెసిడెంట్‌ టకహిరో హచిగో తెలిపారు. కంపెనీ అలాగే పలు ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్‌ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది.  

రెనో: ఫ్రాన్స్‌ కంపెనీ రెనో.. రెండు ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్‌ వెహకల్స్‌ను ఆవిష్కరించింది. ట్రెజోర్, జోయి ఇ–స్పోర్ట్‌ అనేవి వీటి పేర్లు. ‘ఎలక్ట్రిక్‌  వెహికల్స్‌కు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించి స్పష్టమైన పాలసీ కోసం ఎదురుచూస్తున్నాం. దీని ఆధారంగా భవిష్యత్‌ వ్యూహాలు ఉంటాయి’ అని రెనో ఇండియా పేర్కొంది. కంపెనీ అలాగే ఫార్ములా వన్‌ కారు ‘ఆర్‌.ఎస్‌.17’, క్విడ్‌ సూపర్‌ హీరో ఎడిషన్‌ను ప్రదర్శనకు ఉంచింది.  

హ్యుందాయ్‌: దక్షిణ కొరియాకు వాహన కంపెనీ తన ప్రీమియం కాంపాక్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ ‘ఎలైట్‌ ఐ20’లో కొత్త వెర్షన్‌ను తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.5.34–రూ.9.15 లక్షలు.   మూడేళ్లలో భారత్‌లో రూ.6,300 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇక తన పాపులర్‌ మోడల్‌ శాంట్రోను ఈ ఏడాది దీపావళీకి మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశముంది.  

సుజుకీ మోటార్‌సైకిల్‌: సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా తాజాగా 125 సీసీ స్కూటర్‌ బర్గ్‌మాన్‌ స్ట్రీట్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. అలాగే సబ్‌–1,000 సీసీ విభాగంలో జీఎస్‌ఎక్స్‌–ఎస్‌750 బైక్‌ను ప్రదర్శించింది. క్రూయిజర్‌ బైక్‌ ఇన్‌ట్రూడర్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. కంపెనీ దాదాపు స్కూటర్, మోటార్‌సైకిల్, బిగ్‌ బైక్‌ సెగ్మెంట్‌లలో మొత్తంగా 17 మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. 

హీరో మోటొకార్ప్‌: 200 సీసీ అడ్వెంచర్‌ మోటార్‌సైకిల్‌ ‘ఎక్స్‌పల్స్‌’ను, రెండు కొత్త 125 సీసీ స్కూటర్లను ఆవిష్కరించింది.

పియా జియో: ఇటలీకి చెందిన పియాజియో 125 సీసీ బైక్‌ ‘అప్రిలియా ఎస్‌ఆర్‌’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.65,310 (ఎక్స్‌షోరూమ్‌ పుణే). కంపెనీ అలాగే వెస్పా స్కూటర్లను, ఇ–స్కూటర్‌ ఎలెట్రికాను ప్రదర్శనకు ఉంచింది.  

హోండా మోటార్‌సైకిల్‌: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తాజాగా 160 సీసీ బైక్‌ ఎక్స్‌–బ్లేడ్‌ను ఆవిష్కరించింది. అలాగే దాదాపు 10 మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది.  

టీవీఎస్‌ మోటార్‌: టీవీఎస్‌ మోటార్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కాన్సెప్ట్‌ ‘క్రియానో’, 220 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ బైక్‌ ‘జెప్పెలిన్‌’ను ఆవిష్కరించింది. అలాగే అపాచీ ఆర్‌టీఆర్‌ 200 ఎఫ్‌ఐ బైక్‌ను ప్రదర్శనకు ఉంచింది.

యమహా: యమహా ఇండియా స్పోర్ట్స్‌ బైక్‌ వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌15లో కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.1.25 లక్షలు .  

టాటా మోటార్స్‌: టాటా మోటార్స్‌ కంపెనీ లగ్జరీ ఎస్‌యూవీ, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ విభాగాల్లో వరుసగా హెచ్‌5ఎక్స్, 45ఎక్స్‌ అనే రెండు కాన్సెప్ట్‌ వెహికల్స్‌ను ఆవిష్కరించింది. వీటితోపాటు ఆరు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది.  

కవాసకి: కవాసకి ఇండియా రెండు కొత్త బైక్స్‌ నింజా హెచ్‌2 ఎస్‌ఎక్స్‌ స్టాండర్డ్, నింజా హెచ్‌2 ఎస్‌ఎక్స్‌ ఎస్‌ఈ స్పెషల్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.21.8 లక్షలు.  

ఎస్‌ఎంఎల్‌ ఇసుజు: ఎస్‌ఎంఎల్‌ ఇసుజు తాజాగా కార్గో విభాగంలో మూడు మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. సామ్రాట్‌ జీఎస్‌ హెచ్‌డీ 19, సర్టాజ్‌ జీఎస్‌ సీఎన్‌జీ, సామ్రాట్‌ జీఎస్‌ ట్రిప్పర్‌ అనేవి వీటి పేర్లు.  

మెర్సిడెస్‌ బెంజ్‌!: జర్మనీకి చెందిన మెర్సిడెస్‌ బెంజ్‌ తాజాగా మేబ్యాక్‌ ఎస్‌650ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.2.73 కోట్లు. అలాగే కంపెనీ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కాన్సెప్ట్‌ ఈక్యూతోపాటు దాదాపు 13 ప్రొడక్టులను ప్రదర్శనకు ఉంచింది.  

అశోక్‌ లేలాండ్‌: తొలి ఎలక్ట్రిక్‌ బస్సు సర్క్యూట్‌–ఎస్‌ను ఆవిష్కరించింది. వచ్చే 3–6 నెలల్లో అందుబాటులోకి రావొచ్చు.  

టయోటా: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ‘యారిస్‌’ సెడాన్‌ కారును ఆవిష్కరించింది. ఎఫ్‌సీవీ ప్లస్‌ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.  

జేబీఎం: ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ బస్సు సరీస్‌ ‘ఎకో లైఫ్‌’ను ఆవిష్కరించింది. వీటి ధర రూ.2–3 కోట్ల మధ్యలో ఉండొచ్చు.  

మహీంద్రా: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ ఆరు కొత్త ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్‌ వాహనాలను ఆవిష్కరించింది.

కియా మోటార్స్‌: దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ ఎస్‌పీ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంటులో  తయారు చేయనుంది. భారత్‌లో కంపెనీ తొలి వాహనం ఇదే.  

బీఎండబ్ల్యూ: హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఐ8 రోడ్‌స్టర్, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఐ3ఎస్‌లను ప్రదర్శనకు ఉంచింది.

మరిన్ని వార్తలు