ఆదాయ పన్ను వివాదాల  పరిష్కారానికి 2 కమిటీలు 

14 Feb, 2019 01:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ సంబంధ వివాదాల పరిష్కారాలు సూచించేందుకు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్తగా రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవి రెండూ కూడా నెల రోజుల్లోగా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. వివాదాస్పద అంశాల క్రమబద్ధీకరణ, పరిష్కార మార్గాలు సూచించేందుకు ఏర్పాటైన కమిటీకి ఐటీ కమిషనర్‌ హోదా అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు.

ఇక పన్ను వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు ఏర్పాటైన రెండో కమిటీకి కమిషనర్‌ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో కూడా నలుగురు సభ్యులు ఉంటారు. సాధ్యమైనంత వరకూ లిటిగేషన్లను తగ్గించే దిశగా సీబీడీటీ ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకుంది. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో ట్యాక్స్‌ శాఖ అప్పీలు చేసేందుకు ఉద్దేశించిన పన్ను బాకీల పరిమితిని కూడా గణనీయంగా పెంచింది. అధికారిక గణాంకాల ప్రకారం 2018 ఏప్రిల్‌ 1 నాటికి ఐటీ అపీల్స్‌ కమిషనర్‌ ముందు అప్పీల్స్‌ రూపంలో రూ. 6.38 లక్షల కోట్ల బకాయిల వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు