అదీ ఒక్క లాజిస్టిక్స్ రంగంలోనే టీమ్లీజ్ అంచనా
న్యూఢిల్లీ: దేశీ లాజిస్టిక్స్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో వచ్చే నాలుగేళ్లలో 30 లక్షల కొత్త ఉద్యోగాలు రావొచ్చని మానవ వనరుల సంస్థ ‘టీమ్లీజ్’ అంచనా వేసింది. జీఎస్టీ అమలు, మౌలిక రంగంపై పెడుతున్న పెట్టుబడుల వంటివి ఉద్యోగాల సృష్టికి దోహదపడగలవని నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం..
►రోడ్డు రవాణా, రైలు రవాణా, వేర్హౌసింగ్ (గిడ్డంగులు), జలమార్గాలు, వాయు రవాణా, ప్యాకేజింగ్, కొరియర్ సర్వీసులు అనే ఏడు సబ్–సెక్టార్లలో ఈ కొత్త ఉద్యోగాలు రావొచ్చు. దీంతో లాజిస్టిక్స్ రంగంలో ప్రస్తుతం 1.09 కోట్లుగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 2022 నాటికి 1.39 కోట్లకు పెరగొచ్చు.
►రోడ్డు రవాణాలో 18.9 లక్షల ఉద్యోగాలు, రైలు రవాణాలో 40,000 ఉద్యోగాలు, వాయు రవాణాలో 4,00,000 ఉద్యోగాలు, జలమార్గాల్లో 4,50,000 ఉద్యోగాలు రావొచ్చు.
► ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా, రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, జీఎస్టీ అమలు వంటి పలు అంశాలు లాజిస్టిక్స్ రంగ వృద్ధికి కారణంగా నిలువనున్నాయి.
►లాజిస్టిక్స్ రంగంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో కొన్ని కొత్త నైపుణ్యాలు అవసరం కావొచ్చు. అలాగే దిగువ స్థాయిలో పలు ఉద్యోగాల కోత జరగొచ్చు.