5 శాతం పెరిగిన డీసీబీ నికర లాభం

15 Jul, 2015 00:31 IST|Sakshi

ముంబై : ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం  మొదటి త్రైమాసిక కాలంలో 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.45 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.47 కోట్లకు పెరిగిందని  డీసీబీ తెలిపింది. తమకు వర్తించే పన్ను రేటు 16 శాతమని, కానీ తాము 35 శాతం పన్ను రేటు చొప్పున చెల్లించామని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురళి ఎం. నటరాజన్ చెప్పారు. అందుకే నికర లాభం తగ్గిందని వివరించారు.  నికర మొండి బకాయిలు 0.97 శాతం నుంచి 1.22 శాతానికి పెరిగాయని తెలిపారు.

స్థూల మొండి బకాయిలు 1.96 శాతానికి చేరాయని పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం రూ.352 కోట్ల నుంచి రూ.404 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.140 కోట్లకు పెరిగాయని, మొత్తం ఆదాయం రూ.204 కోట్లకు పెరిగిందని వివరించారు. త్వరలో కొత్తగా 30 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని, 400 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నామని  తెలిపారు.

మరిన్ని వార్తలు