ఎన్‌ఆర్‌ఐలకు ఈడీ నోటీసులు

12 Mar, 2018 09:50 IST|Sakshi

ముంబై : ఎన్ఆర్‌ఐలకు చెందిన బ్యాంకు అకౌంట్లు, విదేశీ చెల్లింపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టిసారించింది. గత మూడు నెలల్లో 50 మంది ఎన్‌ఆర్‌ఐలకు ఈడీ నోటీసులు పంపింది. ఈ నోటీసుల్లో వారికి మనీ ఎక్కడి నుంచి వచ్చాయి? రెమిటెన్స్‌ మూలం ఏమిటి? వంటి ప్రశ్నలు సంధిస్తూ.. తమ ముందుకు వచ్చి వీటికి వివరణ ఇవ్వాలని ఎన్‌ఆర్‌ఐలను ఈడీ అధికారులు ఆదేశించారు. నోటీసులు అందిన వారిలో చాలామంది చాలా ఏళ్ల క్రితం విదేశాల్లో స్థిరపడిన వారే ఉన్నారు.  వారు ప్రాపర్టీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్టాక్స్‌, ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులను ఎప్పడికప్పుడూ విక్రయిస్తూ.. ఆ నగదును విదేశాల్లో తమ బ్యాంకు అకౌంట్లకు బదలాయించుకున్నారు. కానీ అన్ని నగదు ట్రాన్స్‌ఫర్లు చట్టబద్ధంగా జరుగలేదని అధికారులు చెప్పారు. చాలా కేసుల్లో నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదని, కొన్ని లావాదేవీలు అనుమానపూరితంగా ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతి ఇచ్చిన మొత్తం కంటే ఎక్కువగా రెమిట్‌ అయిందని తెలిపారు.  
 
ఈ లావాదేవీలపై ఫైనాన్సియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ నుంచి అలర్ట్‌లు పొందామని అధికారులు చెప్పారు. భారత్‌లో ఫండ్స్‌ను నిర్వహించడానికి ఎన్‌ఆర్‌ఐలు మూడు నుంచి నాలుగు రకాల అకౌంట్లను కలిగి ఉంటున్నారని, దీనిలో నాన్‌-రెసిడెంట్‌ ఆర్డినరీ(ఎన్‌ఆర్‌ఓ) సేవింగ్స్‌ అకౌంట్‌ కూడా ఒకటిని పేర్కొన్నారు. ఇది ఒక్క రూపాయికి చెందిందని, వడ్డీలు, స్టాక్‌ గెయిన్స్‌, డివిడెంట్లు, ప్రాపర్టీ సేల్స్‌ వంటి వాటి నుంచి ఆదాయాలు పొందుతుందని చెప్పారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఎన్‌ఆర్‌ఐ అకౌంట్‌ ద్వారా గరిష్టంగా 10 లక్షల డాలర్లను విదేశీలకు రెమిట్‌ చేయొచ్చని తెలిపారు. అదీ కూడా అకౌంట్‌ హోల్డర్‌ లేదా ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ సంతకంతోనే సాధ్యమవుతుందని ఈడీ అధికారులు చెప్పారు. ఎన్‌ఆర్‌ఈ(నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ రూపాయి అకౌంట్‌) ద్వారా కూడా నగదును పంపించుకోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు ఎన్‌ఆర్‌ఓ అకౌంట్ల నుంచి ఎన్‌ఆర్‌ఈ అకౌంట్లకు నగదును పంపించుకుంటున్నారని, వీరి కూడా ప్రశ్నలు ఎదుర్కోబోతున్నట్టు ఓ సీనియర్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ చెప్పారు. మోసపూరిత లావాదేవీ లేదా సెక్యురిటీ డాక్యుమెంట్ల నుంచి నగదు ఎన్‌ఆర్‌ఓ అకౌంట్‌లోకి వస్తే, దాన్ని నిబంధనలు ఉల్లంఘనగా భావిస్తామని చెప్పారు. ఇలా పలు లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు