60 నిమిషాల్లోనే ఇంటికి సరుకులు

17 Dec, 2015 03:21 IST|Sakshi
60 నిమిషాల్లోనే ఇంటికి సరుకులు

 - బిగ్‌బాస్కెట్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఆన్‌లైన్ సూపర్‌మార్కెట్ బిగ్‌బాస్కెట్ తాజాగా బీబీ ఎక్స్‌ప్రెస్ పేరుతో కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 60 నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు. బిగ్‌బాస్కెట్ తొలిసారిగా ఈ సర్వీసులను హైదరాబాద్‌లో ప్రారంభించింది. కంపెనీ ఈ సర్వీసుల కోసం ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసింది. సాధారణంగా గ్యారంటీడ్ డెలివరీ కింద నిర్దేశించిన సమయం దాటితే ఆర్డరు విలువలో 10 శాతం మొత్తాన్ని కస్టమర్ ఖాతాకు (వాలెట్) జమచేస్తోంది.
 
 అలాగే ఏదైనా ఉత్పత్తి అందించలేకపోతే దాని విలువలో 50 శాతం మొత్తాన్ని వాలెట్‌లో జమచేస్తారు. వినియోగదార్ల సౌకర్యార్థం బీబీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామని కంపెనీ సహ వ్యవస్థాపకులు అభినయ్ చౌదరి బుధవారమిక్కడ తెలిపారు. కంపెనీ బిజినెస్ హెడ్ వి.హరి కృష్ణారెడ్డి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ రాగలీనా శ్రీపాదతో కలసి మీడియాతో మాట్లాడారు. పరిచయ ఆఫర్‌లో భాగంగా ఫస్ట్ టైం యూజర్లకు పేటీఎం ద్వారా 20 శాతం క్యాష్ బ్యాక్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఆఫర్ జనవరి 3 వరకు ఉంటుంది.
 
 ఆన్‌లైన్ రిటైల్ విభాగంలో కంపెనీ వృద్ధికి కొత్త సర్వీసులు దోహదం చేస్తాయని అభినయ్ అభిప్రాయపడ్డారు. ‘ఇతర నగరాలకూ బీబీ ఎక్స్‌ప్రెస్‌ను పరిచయం చేయనున్నాం. రోజుకు 30,000 డెలివరీలను చేస్తున్నాం. 2014-15లో రూ.210 కోట్ల టర్నోవర్ ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు చేరుకుంటాం’ అని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు