ఏ35కే సంచలనం సృష్టిస్తోంది

26 Aug, 2014 00:51 IST|Sakshi
ఏ35కే సంచలనం సృష్టిస్తోంది

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటీవల విడుదల చేసిన తమ స్మార్ట్‌ఫోన్ ఏ35కే సంచలనం సృష్టిస్తోందని, ఇప్పటికే లక్షకుపైగా పీసులు అమ్ముడయ్యాయని సెల్‌కాన్ సీఎండీ వై.గురు వెల్లడించారు. ఆన్‌డ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో రూపొందించిన ఈ మోడల్‌లో మరో 10 లక్షల ఫోన్లకు ఆర్డర్లున్నాయని ఆయన చెప్పారు.

మార్కెట్లో కిట్‌క్యాట్‌తో 3జీ ఫోన్ల ధర రూ.10 వేల పైమాటేనని, తాము రూ.3 వేలకే అందించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్‌కు అనూహ్య స్పందన వస్తోందని, అగ్ర దేశాల వెబ్‌సైట్లు సైతం ఈ మోడల్ గురించి చర్చించడం విశేషమన్నారు. కొన్ని సెల్‌ఫోన్ కంపెనీలు సెల్‌కాన్‌ను అనుసరించనున్నాయని తెలిపారు. ఇప్పటికే తాము విక్రయిస్తున్న 9 దేశాలతోపాటు యూరప్, ఆఫ్రికాలో మరో 20 దేశాల్లో ఏ35కే విడుదల చేయనున్నట్టు చెప్పారు. మార్కెట్ తీరుతెన్నులు, భవిష్యత్ మోడళ్ల వివరాలను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు?
 టెక్నాలజీతోపాటే కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. ఫీచర్లపరంగా చూస్తే కిట్‌క్యాట్, 2జీబీ ర్యామ్, గెస్చర్ సెన్సార్, రంగు రంగుల్లో ఎక్స్‌ట్రా ప్యానెల్స్, క్వాడ్‌కోర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, స్లిమ్, తేలికైన ఫోన్లను కస్టమర్లు కోరుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లను రూపొందిస్తున్నాం.

 పలుచని, తేలికైన స్మార్ట్‌ఫోన్‌తో రికార్డుల్లోకి ఎక్కారు. భవిష్యత్ మోడళ్లు ఏం తేబోతున్నారు?
 కిట్‌క్యాట్‌తో మిలీనియం సిరీస్‌లో ఇప్పటికి 5 మోడళ్లు తెచ్చాం. మరో రెండు రానున్నాయి. అన్ని మోడళ్లు క్వాడ్‌కోర్‌తో రూపొందినవే. రూ.6 వేల లోపే క్వాడ్‌కోర్ మోడల్‌ను తీసుకొచ్చాం. 7.9 మిల్లీమీటర్ల మం దంలో క్యూ455 మోడల్ ప్రవేశపెట్టాం. క్వాడ్‌కోర్‌లో ఇంత పలుచని ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. అమెరికా కంపెనీ బ్రాడ్‌కామ్ చిప్‌సెట్ వాడాం.

ఫోన్ వేడి కాకుండా పీసీబీ లేఅవుట్ డిజైన్ చేశాం. ఇక 2జీబీ ర్యామ్‌తో క్యూ500 అనే మోడల్ ఈ వారమే మార్కెట్లోకి వస్తోంది. దసరాకల్లా ఆక్టాకోర్ మోడల్‌ను ఆవి ష్కరిస్తాం. 5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లుంటాయి. కలర్ ప్యానెల్స్‌తో 3జీ కిట్‌క్యాట్ ఫోన్‌ను ప్రపంచంలో తొలిసారిగా రూ.5 వేలలోపు పరిచయం చేస్తాం.

 కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారా?
 ఫ్యాబ్లెట్స్ విభాగంలోకి ప్రవే శిస్తున్నాం. 1 జీబీ ర్యామ్, 16  జీబీ ఇంటర్నల్ మెమరీ, వన్ గ్లాస్ సొల్యూషన్‌తో 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో రానుంది. డ్యూయల్ కోర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీతో 7 అంగుళాల ట్యాబ్లెట్ పీసీ సెప్టెంబరులో తీసుకొస్తున్నాం. గ్లాస్ ఫినిష్, హెచ్‌డీ డిస్‌ప్లే అదనపు ఆకర్షణ. ధర రూ.7 వేల లోపే ఉం టుంది. పవర్ బ్యాకప్, డేటా కార్డ్స్, బ్లూ టూత్ వంటి యాక్సెసరీస్ విభాగాల్లోనూ అడుగు పెట్టనున్నాం.

 త్వరలో వైఫై సిటీలు రాబోతున్నాయి. వీటికి సంబంధించి మీరేం చేయబోతున్నారు?
 నవంబరులో 4జీ ఫోన్ల విభాగంలో రెండు మోడళ్లతో అడుగు పెడతాం.  అలాగే బేసిక్ ఫోన్లను వైఫై ఫీచర్‌తో ప్రవేశపెట్టబోతున్నాం. ఖరీదైన ఫోన్ మాదిరిగా గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ధర రూ.2 వేల లోపే. కెపాసిటివ్ టచ్‌తో రూ.2,500కే వైఫై మోడల్‌ను ఆవిష్కరిస్తాం. మా ప్రస్థానం ప్రారంభమైంది ఫీచర్ ఫోన్ల నుంచే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విభాగాన్ని విస్మరించం. వాట్సాప్‌తో 7 బేసిక్ మోడళ్లను తెచ్చాం. ఎక్స్‌ట్రా ప్యానెల్స్‌తో ఒక మోడల్‌ను రూ.1,500లకే విక్రయిస్తున్నాం. అందుబాటు ధరలో ప్రభుత్వానికి వైఫై ఫోన్లు విక్రయించేందుకు మేం సిద్ధం.

 ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యూహం ఏమిటి?
 మార్కెట్‌కు అనుగుణంగా కొన్ని మోడళ్లను స్నాప్‌డీల్ వంటి కంపెనీల భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాం. దేశవ్యాప్తంగా 800, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 165 సర్వీసింగ్ కేంద్రాలతో కస్టమర్లకు చేరువయ్యాం. ఫోన్ కొనుగోలు చేసిన వారంలోపు సమస్య వస్తే కొత్తది ఇస్తున్నాం. ఏడాది వరకు ఉచిత సర్వీస్ అందిస్తున్నాం. ఓవర్ ద ఎయిర్(ఓటా) అనే యాప్‌తో పాత వర్షన్ నుంచి కిట్‌క్యాట్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలు కల్పిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.

 విక్రయాల్లో ఏ స్థానంలో ఉన్నారు?
 గత మూడేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫీచర్ ఫోన్ల అమ్మకాల్లో అగ్ర స్థానంలో ఉన్నాం. నెలకు 3 లక్షల ఫోన్లను విక్రయిస్తున్నాం. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల విభాగంలోనూ తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నాం.

మరిన్ని వార్తలు