వంద కోట్ల సార్లు ప్రయత్నించినా.. చేయలేరు!

16 Jul, 2018 13:06 IST|Sakshi
ఆధార్‌ బయోమెట్రిక్‌ డేటా (ఫైల్‌ ఫోటో)

పనాజీ : ఆధార్‌ బయోమెట్రిక్‌ డేటా భద్రతపై ఎవరెన్ని అనుమానాలు సృష్టించినా.. ప్రభుత్వం మాత్రం వివరణ ఇస్తూనే ఉంది. ఈసారి కాస్త ఘాటుగానే క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా ఆధార్‌ డేటాను దొంగలించడానికి, హ్యాక్‌ చేయడానికి వంద కోట్ల సార్లు ప్రయత్నించినా... దాన్ని మాత్రం హ్యాక్‌ చేయలేరని ఆధార్‌ డేటా భద్రతపై వస్తున్న రూమర్లన్నింటిన్నీ కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. డేటా స్టోరేజ్‌ సిస్టమ్‌ పూర్తి భద్రంగా, సురక్షితంగా ఉందని మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. ఈ సిస్టమ్‌లో చాలా మంది ఫింగర్‌ప్రింట్‌లు, ఐరిస్‌ స్కాన్‌లు ఉన్నాయని, వాటిని తాము ఎంతో భద్రంగా, సురక్షితమైన పరిస్థితుల్లో ఉంచామని తెలిపారు. వీటిని హ్యాక్‌ చేయడానికి వందల కోట్ల సార్లు ప్రయత్నించినా.. ఏ మాత్రం లీక్‌ కాదని, హ్యాక్‌ చేయలేరని పనాజీలో జరిగిన ఓ పబ్లిక్‌ ఫంక్షన్‌లో స్పష్టం చేశారు. ప్రతి సెకన్‌కు సుమారు కోటి మంది ధృవీకరణలను ఆధార్‌ అథారిటీలు చేపడుతున్నాయని చెప్పారు.

 ‘ప్రతి మూడు సెకన్లకు ఎంతమంది ధృవీకరణలు జరుగుతున్నాయో మీకు తెలుసా? మూడు కోట్లు. ఎన్ని బ్యాంక్‌ అకౌంట్లు ఆధార్‌కు లింక్‌ అవుతున్నాయో తెలుసా? 80 కోట్ల అకౌంట్లు. ఆధార్‌ అనేది దేశీయ టెక్నాలజీ. పూర్తిగా భద్రంగా, సురక్షితంగా ఉంటుంది.’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. భారత్‌ను మరింత డిజిటల్‌గా రూపాంతరం చేసేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. భారత్‌లో 130 కోట్ల మంది జనాభా ఉంటే, వారిలో 121 కోట్ల మంది మొబైల్‌ ఫోన్లున్నాయని, 450 మిలియన్‌ మందికి స్మార్ట్‌ఫోన్లు, 50 కోట్లకు పైగా మంది ఇంటర్నెట్‌ కనెక్షన్లు, 122 కోట్ల ఆధార్‌ కార్డులు ఉన్నాయని.. ఇదీ భారత్‌ డిజిటల్‌ ప్రొఫైల్‌ అని చెప్పారు. ‘మనం పారిశ్రామిక విప్లవాన్ని, వ్యవస్థాపక విప్లవాన్ని మిస్‌ అయ్యాం. లైసెన్స్‌ క్వోటా రాజ్‌ కింద అవన్నీ 1960, 70ల్లో జరిగాయి. కానీ మనం డిజిటల్‌ విప్లవాన్ని చేజార్చుకోవద్దు. మనం కూడా అధినేతలుగా నిలువాలి. ఇదే డిజిటల్‌ ఇండియా ఫిలాసఫీ’ అని ఉద్ఘాటించారు. 

మరిన్ని వార్తలు