సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ ఆధార్, పాన్ కార్డు వివరాలు, మీ ఎల్ఐసీ పాలసీలకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దేశంలోనే అతిపెద్ద లైఫ్ ఇన్సూరర్ తన వెబ్సైట్లో తెలిపింది. పాలసీ హోల్డర్స్ తమ పాలసీలకు ఆధార్ లింక్ చేసుకోవడం కోసం ఎల్ఐసీ ఆన్లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. కానీ ఇటీవల ఎస్ఎంఎస్ను పంపించి.. ఆధార్తో ఎల్ఐసీ పాలసీని లింక్ చేసుకోవాలంటూ ఎల్ఐసీ పేరు మీద బూటకపు మెసేజ్లు వస్తున్నాయి. అలా వచ్చిన మెసేజ్ను నమ్మి, నిజంగా ఎస్ఎంఎస్తో ఆధార్ను లింక్ చేస్తే ఇక పాలసీదారుడి పని అంతేనని, వివరాలన్నీ లీకైపోతాయని ఎల్ఐసీ ప్రకటించింది. అలాంటి లింకుల మెసేజీలను నమ్మొద్దంటూ ఎల్ఐసీ సంస్థ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో వెల్లడించింది. సోషల్మీడియాలో విస్తృతంగా వస్తున్న ఆ సమాచారాన్ని, ప్రచారాన్ని నమ్మొద్దని, తాము అలాంటి ఎస్ఎంఎస్లను పంపించట్లేదనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఆన్లైన్ విధానం ద్వారానే పాలసీలను పాన్, ఆధార్తో లింక్ చేసుకునే ప్రక్రియను చేపడుతున్నామని ఎల్ఐసీ తెలిపింది.