ఆహారానికి ఆధార్‌ కావాలి 

22 Dec, 2017 16:21 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుతం ఆధార్‌ను ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి అనుసంధానం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం అందించే జాతీయ పోషకాహార మిషన్ కింద చిన్నపిల్లలు ఆహారం పొందాలంటే ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ అవసరమని ప్రభుత్వం నేడు లోక్‌సభకు తెలిపింది. మహిళల, పిల్లల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్‌ ఈ విషయాన్ని తెలిపారు. సర్వీసులను, ప్రయోజనాలను, సబ్సిడీలను అందించడానికి ఆధార్‌ను ఒక ఐడెంటీ కార్డుగా వాడనున్నామని, ఇది ప్రభుత్వం డెలివరీ ప్రక్రియను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఆధార్‌ పారదర్శకతను, సామర్థ్యాన్ని తీసుకొస్తుందన్నారు.

ఒకరి గుర్తింపును నిరూపించేందుకు బహుళ పత్రాలను సమర్పించే అవసరానికి ఆధార్‌ చెక్‌ పెడుతుందన్నారు. లబ్ధిదారులకు ఆధార్‌ ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంటుందని వివరించారు. అంతేకాక దేశంలో ప్రాంతం ఆధారంగా పోషకాహార స్థితిని గుర్తించడానికి కూడా ఆధార్‌ సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇటీవలే ప్రభుత్వం కేంద్ర పోషకాహార మిషన్‌ను ఆమోదించింది. ఈ మిషన్‌ కింద దేశంలో ఉన్న పోషకాహార లోపాన్ని గుర్తించి, నిర్మూలించడం ప్రారంభించింది. ఈ మిషన్‌కు అ‍య్యే ఖర్చు మూడేళ్లలో రూ.9,046.17 కోట్లుగా ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే అంగనవాడీ సెంటర్లలో చిన్న పిల్లల నకిలీ రిజిస్ట్రేషన్లను గుర్తించడానికి ఎలాంటి సర్వే చేపట్టడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా కుమార్‌ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు