ఆదిభట్ల మరో హైటెక్ సిటీ!

8 Nov, 2014 01:47 IST|Sakshi
ఆదిభట్ల మరో హైటెక్ సిటీ!

సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల క్రితం అక్కడ గజం స్థలం ధర రూ.2 వేలు కూడా కష్టమే. కానీ, నేడు రూ.8 వేలకు పైగానే పలుకుతోంది! ఒకప్పుడు షేర్ ఆటోలు కూడా తిరగని ఆ ప్రాంతంలో ఇప్పుడు లగ్జరీ కార్లు దూసుకెళ్తున్నాయ్!! ఒకప్పుడు సినిమా చూడాలంటే సిటీకీ రావాల్సిందే. కానీ నేడక్కడే మల్టీప్లెక్స్‌లు రూపుదిద్దుకుంటున్నాయ్!!! ఇంతకీ ఆ ప్రాంతమేంటంటే ఆదిభట్ల గ్రామం.

ఐటీ సెజ్ రాకతో ఇప్పటికే రియల్ దూకుడు మీదున్న ఆదిభట్లలో ఇప్పుడు ఏరోస్పేస్ కంపెనీలూ క్యూ కడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఆదిభట్ల గ్రామం మరో హైటెక్ సిటీగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

 స్థిరాస్తి వ్యాపారానికి సెలైన్ ఎక్కించేవి ఐటీ కంపెనీలు. ఇది చాలదన్నట్లు ఆదిభట్లలో ఏరోస్పెస్ కంపెనీలూ కొలువుదీరాయి. గతంలోనే ఆదిభట్లలో 250 ఎకరాల్లో వైమానిక సెజ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెజ్‌లో టాటా సికోర్ స్కై, టాటా అడ్వాన్‌‌స్డ సిస్టమ్, టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్, సముహా ఏరోస్పేస్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

ఇటీవలే టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ సంస్థ జర్మనీకి చెందిన రుమాగా సంస్థతో కలసి డార్నియర్ విమాన పరికరాల తయారీ పరిశ్రమనూ స్థాపించింది. డార్నియర్-228 విమాన ప్రధాన భాగంతో పాటు విమాన రెక్కలను కూడా ఇక్కడ తయారు చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రానుంది. ఇందులో క్లస్టర్-3లో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీలో ఆదిభట్ల, మహేశ్వరం, రావిరాల, మామిడిపల్లిలో 79.2 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది.

అంతేకాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్-1కు 11.5 చ.కి.మీ., కారిడార్-2కు  14.3 చ.కి.మీ. కేటాయించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బొంగ్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దీన్ని అనుసంధానం చేస్తారు. మరోవైపు  ఆదిభట్ల ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కి.మీ., ఎల్బీనగర్‌కు 12 కి.మీ., ఔటర్ రింగ్ రోడ్డుకు 1.5 కి.మీ. దూరంలో ఉండటమూ మరింత కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 జనవరిలో టీసీఎస్ ప్రారంభం..
 ఆదిభట్లలో ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులున్నారు. వచ్చే జనవరిలో టీసీఎస్‌లో కొత్తగా 28 వేల ఉద్యోగులు రానున్నట్లు సమాచారం. దీంతో ఆదిభట్ల చుట్టుపక్కల ప్రాంతాలు హైటెక్ సిటీని తలపించనున్నాయన్నమాట. గతంలో ఇండిపెండెంట్ హౌస్‌లకే పరిమితమైన ఈ ప్రాంతానికి ఇప్పుడు అపార్ట్‌మెంట్ సంస్కృతికి చేరింది.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్లపై రియల్టర్లు, ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు ఇలా అందరి చూపు పడింది. భారీ నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు 6 బడా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ధరలు కూడా అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా, మౌలిక వసతులు పుష్కల్కంగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, మదుపుదారులు, ఎన్నారైలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఎగబాకుతున్నారు. రెండు మూడేళ్ల కిత్రం ఆదిభట్లలో గజం స్థలం ధర రూ.2 వేలుగా ఉండేది. కానీ, ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పైగానే పలుకుతోంది.

 ఆదిభట్లలోని పలు ప్రాజెక్ట్‌లివే..
 బొంగ్లూరు ఓఆర్‌ఆర్ వద్ద 20 ఎకరాల్లో మెట్రోసిటీ ఇన్‌ఫ్రాటెక్ ఫేజ్-2ను ప్రారంభించినట్లు  మెట్రో సిటీ ఇన్‌ఫ్రా డెవలపర్‌‌స చైర్మన్ కే మనోహర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే 36 ఎకరాల్లో ఫేజ్-1ను పూర్తి చేశాం. గజం ధ ర రూ.5,500లుగా నిర్ణయించాం.
 ఆదిభట్ల టీసీఎస్ వెనుక ప్రాంతంలో 20 ఎకరాల్లో మరో కొత్త వెంచర్‌ను ప్రారంభించాం. గజం ధర రూ.18-20 వేలుగా చెబుతున్నాం. రానున్న రోజుల్లో ఆదిభట్లలో మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
 సామాన్యులకు సైతం సొంతిల్లు అందించేందుకు గాను గున్‌గల్‌లో 30 ఎకరాల్లో శ్రీ బాలాజీ నగర్‌ను నిర్మిస్తున్నట్లు శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్ అధినేత ఎన్. కృష్ణ గౌడ్ చెప్పారు. ముందుగా 25 శాతం సొమ్ము చెల్లిస్తే సరి.. మిగతా డబ్బును 24 సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించేలా ఆఫర్‌ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. గజం ధర రూ.4 వేలుగా నిర్ణయించామన్నారు.

మరిన్ని వార్తలు