ఆ సమయంలో మొబైల్‌ ఫోన్లు బ్యాన్‌

16 Jun, 2018 17:31 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇటీవల వాట్సాప్‌ లీక్‌ కేసు కంపెనీలను ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ, వాట్సాప్‌ లీక్‌ కేసు వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ లీక్‌ల్లో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న వారందర్ని సెబీ విచారిస్తోంది. తాజాగా కంపెనీలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. కంపెనీ ఆడిట్‌ సమావేశాల సమయంలో మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లను కంపెనీలు అనుమతించకూడదని నిర్ణయించినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.  లీకేజీలను నివారించడానికి, ఆడిట్ కమిటీ సమావేశాలను నిర్భందపూర్వక వాతావరణంలో, బడ్జెట్‌ను రూపొందించిన మాదిరిగా నిర్వహించాలనుకుంటున్నట్టు తెలిపాయి. 

అధికారికంగా కంపెనీలు తమ ఫలితాలను వెలువరించకముందే, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా, సోషల్‌ మీడియా చాట్‌రూంల ద్వారా కొన్ని బ్లూచిప్‌ కంపెనీలు, లిస్ట్‌ అయిన కంపెనీల సున్నితమైన సమాచారం లీక్‌ అయింది. ఈ కేసుపై సెబీ తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతోంది. 30 మందికి పైగా మార్కెట్‌ విశ్లేషకులు, డీలర్లకు సంబంధించిన ప్రాంతాల్లో సెబీ తనిఖీలు కూడా చేసింది. సమాచారం లీక్‌ అయిన కంపెనీల్లో సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, మహింద్రా హాలిడే, రిసోర్ట్స్‌లు ఉన్నాయి. వాట్సప్‌లో సమాచారం లీకేజి కేసులో సెబీ తొలిసారిగా యాక్సిస్ బ్యాంక్‌ను సైతం ఆదేశించింది. ఇందుకు సంబంధించి టెక్నాలజీ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని, అలాగే అంతర్గతంగా విచారణ జరుపాలని సెబీ సూచించింది. 

మరిన్ని వార్తలు