సరైన రేటు వస్తేనే ఎయిరిండియా విక్రయం

23 May, 2018 00:42 IST|Sakshi

స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను సరైన ధర వస్తేనే విక్రయిస్తామని లేనిపక్షంలో విక్రయించేది లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే స్పష్టం చేశారు. అయితే, కచ్చితంగా మంచి ధరే రాగలదని ఆశిస్తున్నట్లు వివరించారు. ఎయిరిండియా కొనుగోలు కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను సమర్పించడానికి మే 31 ఆఖరు తేదీ కాగా, జూన్‌ 15 తర్వాత రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ను జారీ చేయనున్నట్లు చౌబే చెప్పారు.

ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చౌబే తెలిపారు. అత్యధికంగా బిడ్‌ చేసిన సంస్థ పేరు ఆగస్టు ఆఖరు కల్లా తెలుస్తుందన్నారు. భారీగా రుణాలు, నష్టాలు పేరుకుపోయిన ఎయిరిండియాలో ప్రభుత్వం 76 శాతం దాకా వాటాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు