ముంబై: దేశీయంగా చౌక విమాన సర్వీసులు ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మలేషియా విమానయాన దిగ్గజం ఎయిర్ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మంగళవారం పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్తో భేటీ కానున్నారు. ఎయిర్ఏషియా ఇండియా ప్రధాన సలహాదారు రతన్ టాటాతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. టాటా గ్రూప్తో కలిసి విమాన సేవలు చౌకగా అందించే క్రమంలో ఇతర కంపెనీల నుంచి పోటీని సమర్ధంగా ఎదుర్కొనగలమని ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫెర్నాండెజ్ చెప్పారు. ముందుగా 3 విమానాలతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, తర్వాత ఏటా 10 విమానాలను కొత్తగా జోడిస్తామని ఆయన వివరించారు. అత్యంత ఖరీదైన న్యూఢిల్లీ, ముంబై విమానాశ్రయాలకు సత్వరం సర్వీసులు ప్రవేశపెట్టే యోచనేదీ లేదని ఫెర్నాండెజ్ పేర్కొన్నారు.