నోకియా ఫోన్లపై ఎయిర్‌టెల్‌ క్యాష్‌బ్యాక్‌!!

20 Feb, 2018 00:30 IST|Sakshi

రూ.2,000 వరకు..

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ ‘భారతీ ఎయిర్‌టెల్‌’ తాజాగా ఎంపిక చేసిన నోకియా స్మార్ట్‌ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌ అందిస్తామని ప్రకటించింది. నోకియా–2, నోకియా–3 స్మార్ట్‌ఫోన్లపై తమ ప్రిపెయిడ్‌ కస్టమర్లు రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చని తెలిపింది. ‘కస్టమర్లకు అందుబాటు ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్లను అందించాలనే లక్ష్యంతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం.

ఇందులో భాగంగా నోకియా–3, నోకియా–2 స్మార్ట్‌ఫోన్లపై రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తున్నాం’ అని భారతీ ఎయిర్‌టెల్‌ వివరించింది. ఇక నోకియా రెండు స్మార్ట్‌ఫోన్లు ఎయిర్‌టెల్‌ ప్రత్యేకమైన రీచార్జ్‌ ప్యాక్‌ రూ.169తో బండిల్‌ ఆఫర్‌ కింద కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. రూ.169 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్‌ వంటి ఫీచర్లున్నాయి.  

క్యాష్‌బ్యాక్‌ ఇలా..
ఎయిర్‌టెల్‌ కస్టమర్లు నోకియా–2, నోకియా–3 స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాష్‌బ్యాక్‌ మొత్తం రూ.2,000.. 36 నెలల కాలంలో రెండు విడతల్లో యూజర్‌ ఎయిర్‌టెల్‌ వాలెట్‌లో జమవుతుంది. తొలి విడత క్యాష్‌బ్యాక్‌ (రూ.500) పొందాలంటే యూజర్‌ ఫోన్‌ కొనుగోలు దగ్గరి నుంచి తొలి 18 నెలల కాలంలో రూ.3,500 విలువైన రీచార్జ్‌ చేసుకోవాలి. ఇక తర్వాతి 18 నెలల కాలంలో మళ్లీ రూ.3,500 విలువైన రీచార్జ్‌ చేయించుకోవాలి. అప్పుడు రెండో విడత క్యాష్‌బ్యాక్‌ (రూ.1,500) పొందొచ్చు. కాగా నోకియా–3 ధర రూ.9,499గా, నోకియా–2 ధర రూ.6,999గా ఉంది.  

మరిన్ని వార్తలు