ఎయిర్‌టెల్‌ ఉచితంగా 30జీబీ డేటా

13 Apr, 2018 14:13 IST|Sakshi

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్‌ అయ్యే తన ప్రస్తుత 2జీ, 3జీ కస్టమర్లకు ఉచితంగా 30జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది  ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’  కార్యక్రమంలో మరో ఆఫర్‌గా కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌ తన ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లందరికీ వర్తించనుంది. కంపెనీ ఛార్జ్‌ చేసే ప్యాక్‌ల పైన రోజూ ఉచితంగా 1జీబీ డేటాను 30 రోజుల పాటు ప్రీపెయిడ్‌ కస్టమర్లు పొందనున్నట్టు కంపెనీ తెలిపింది. అదే పోస్టు పెయిడ్‌ కస్టమర్లైతే రోల్‌ఓవర్‌ సౌకర్యం కింద తొలి బిల్‌ సైకిల్‌లో ఉచితంగా 30జీబీ డేటాను పొందనున్నారు.

అయితే ఈ ఉచిత డేటా ప్రయోజనాలను క్లయిమ్‌ చేసుకోవడానికి, అర్హతను చెక్‌ చేసుకోవడానికి 51111 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలని లేదా మై ఎయిర్‌టెల్‌ మొబైల్‌ యాప్‌లో చూసుకోవాలని పేర్కొంది. 24 గంటల్లో 30జీబీ ఉచిత డేటాను కస్టమర్లకు క్లయిమ్‌ చేస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. మరింత సమాచారం కోసం ఎయిర్‌టెల్‌ కస్టమర్లు airtel.in/4gupgrade వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని చెప్పింది. 4జీ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని, లక్షల కొద్దీ ఫీచర్‌ ఫోన్‌, 3జీ డివైజ్‌లు, 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్‌ కావాలనుకోవడం అతిపెద్ద నిర్ణయమని భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంఓ వేణి వెంకటేశ్‌ తెలిపారు. ఇదే కస్టమర్‌కు చెందిన అతిపెద్ద రివార్డింగ్‌ ప్రొగ్రామ్‌ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో 4జీ స్పీడ్‌లో ఆన్‌లైన్‌ ప్రపంచాన్ని అనుభవించే అవకాశం తమ కస్టమర్లకు దొరుకుతుందన్నారు. ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’ కార్యక్రమం కింద ఇప్పటికే ఎయిర్‌టెల్‌, పలు మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని, అత్యంత తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతోంది. 

మరిన్ని వార్తలు