మొబైల్‌ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ

5 Nov, 2019 05:20 IST|Sakshi

భారతి ఎయిర్‌టెల్‌ ఆఫరు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ తమ ప్రీ–పెయిడ్‌ మొబైల్‌ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన రూ. 599 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అదనంగా రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుందని ఎయిర్‌టెల్‌ వివరించింది. ఈ రీచార్జ్‌ వేలిడిటీ 84 రోజులు ఉంటుందని, ప్రతీ రీచార్జ్‌తో పాటు బీమా కవరేజీ ఆటోమేటిక్‌గా మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపింది. 18–54 ఏళ్ల కస్టమర్లకు ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యపరీక్షలు అవసరం లేదని వివరించింది. దీన్ని ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టినట్లు, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ వివరించింది.  

మరిన్ని వార్తలు