5జీ స్పెక్ట్రమ్‌ బేస్‌ ధర భరించలేనిది

1 Jun, 2019 07:26 IST|Sakshi

ప్రభుత్వం సమీక్షించాలి: ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ: ట్రాయ్‌ సిఫారసు చేసిన 5జీ స్పెక్ట్రమ్‌ ధర భరించలేని స్థాయిలో, అత్యధికంగా ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 5జీ సేవలు వేగంగా విస్తరించేందుకు వీలుగా స్పెక్ట్రమ్‌ బేస్‌ ధరను ప్రభుత్వం సమీక్షించాలని కోరింది. 5జీ స్పెక్ట్రమ్, రిజర్వ్‌ ధరను ప్రభుత్వం సమీక్షిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అప్పుడే తాము 5జీ గురించి పరిశీలిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ భారత్, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌విట్టల్‌ తెలిపారు. 100 మెగాహెర్జ్‌ 5జీ స్పెక్ట్రమ్‌కు ట్రాయ్‌ నిర్ణయించిన ధర రూ.50,000–55,000 కోట్లుగా ఉన్నట్టు విట్టల్‌ తెలిపారు. ‘‘5జీకి చాలా పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్‌ అవసరం అవుతుంది. 40 మెగాహెర్జ్‌ ఉంటే 5జీ తరహా అవసరాలకు చాలదు. వేగం, సామర్థ్యం పరంగా పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్‌ కావాల్సిందే. స్పష్టంగా చెప్పాలంటే ఈ ధరలను మేం భరించలేం’’ అని విట్టల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు