జియోకి పోటీ : ఎయిర్‌టెల్‌ లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌

18 Jun, 2018 19:41 IST|Sakshi

రిలయన్స్‌ జియోకి పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, కొత్త కొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. 597 రూపాయలతో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా ఆఫర్‌ చేసిన ఈ ప్లాన్‌ కింద దీర్ఘకాలికంగా వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలను ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 168 రోజులు. కాలింగ్‌తో పాటు డేటా ప్రయోజనాలను, ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాలను ఇది ఆఫర్‌ చేస్తోంది. రిలయన్స్‌ జియో లాంగ్‌ టర్మ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లకు, ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌ గట్టి కౌంటర్‌ ఇస్తోంది. కొన్ని రీజన్‌లలో ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. 

ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 168 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 10 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. అయితే డేటా ప్రయోజనాలు అన్ని ప్లాన్లతో పోలిస్తే చాలా తక్కువే. ఈ ప్లాన్‌ను కేవలం వాయిస్‌ కాల్‌ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్‌ అంతకముందు కూడా అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో రూ.995 రీఛార్జ్‌ ప్లాన్‌ను లాంచ్‌చేసింది. ఆ ప్లాన్‌ కింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, నెలకు 1జీబీ డేటాను 180 రోజుల పాటు అందిస్తోంది. ప్రస్తుతం లాంచ్‌ చేసిన రూ.597 ప్లాన్‌, జియో రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌కు డైరెక్ట్‌  పోటీగా ఉంది. 

మరిన్ని వార్తలు