జియోకు షాక్‌ : దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌ 

10 Jan, 2020 16:10 IST|Sakshi

 వైఫై కాలింగ్‌ ఫీచర్‌లో ఎయిర్‌టెల్‌ దూకుడు

10 లక్షల మార్క్‌ను దాటేసిన చందాదారులు

సాక్షి, ముంబై:  టెలికాం దిగ్గజం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌  ఇటీవల ప్రారంభించిన వైఫై కాలింగ్ ఫీచర్ దూసుకుపోతోంది. ఇప్పటికే ఒక మిలియన్‌కు పైగా వినియోగదారులను నమోదు చేసింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వైఫై కాలింగ్‌ ఫీచర్‌ తీసుకొచ్చింది తామేనని ఎయిర్‌టెల్ వినియోగదారులు ఏ వైఫైలో అయినా ఈ సేవను ఉపయోగించుకోవచ్చని భారతి ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ తెలిపారు. ముఖ‍్యంగా ప్రధాన ప్రత్యర్థి, రిలయన్స్‌ జియో తమ మొబైల్‌ వినియోగదారులకోసం వైఫై సేవలను ప్రారంభించిన రెండు రోజుల తరువాత ఈ గణాంకాలను విడుదల చేయడం గమనార్హం.  

కాగా గత ఏడాది డిసెంబరులో ఎయిర్‌టెల్‌ తన  ‘వాయిస్‌‌ ఓవర్‌‌‌‌ వైఫై (వీఓవైఫై)’ సేవలను మొట్టమొదటి సారిగా ప్రారంభించింది. ఈ సేవలు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలతోపాటు ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కోల్‌కతాలో అందుబాటులో ఉన్నాయి. 16 బ్రాండ్లలో 100కి పైగా స్మార్ట్‌ఫోన్ మోడళ్లు, ప్రస్తుతం ఎయిర్‌టెల్  వైఫై కాలింగ్‌  ఫీచర్‌కు మద్దుతునిస్తున్నాయి. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్‌‌ హాట్‌‌స్పాట్‌‌ లేదా ప్రైవేట్‌‌ హోం వైఫై నెట్‌‌వర్క్‌‌కు కనెక్ట్‌‌ చేసుకొని ఏ మొబైల్‌‌ఫోన్‌‌కైనా, ల్యాండ్‌‌లైన్‌‌కైనా కాల్స్‌‌ చేసుకోవచ్చు.  

మరిన్ని వార్తలు