-

లాక్‌డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట

6 Apr, 2020 10:32 IST|Sakshi

ఎయిర్‌టెల్, వొడాఫోన్ యూజర్లకు ఉపశమనం

 ఏటీఎంల ద్వారా మొబైల్ రీచార్జ్  

వివిధ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్న టెలికాం దిగ్గజాలు

సాక్షి, ముంబై: దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త ఇది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకోలేని తమ వినియోగదారులను దృష్టిలో వుంచుకుని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇకపై తమ దగ్గర ఉన్న ఏటీఎంలో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. టెలికాం దిగ్గజం జియో బాటలో నడిచిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ కూడా తమ కస్టమర్లకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతోపాటు ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎంపిక చేసిన కొన్ని కిరాణా, ఫార్మసీ దుకాణాల్లో కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిర్‌టెల్ ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఎయిర్‌టెల్ వినియోగారులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల ఏటీఎంల వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బిఐ, యాక్సిస్, సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్‌ బ్యాంకుల ఏటీఎంలలో మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఇరు సంస్థలు ఈ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. వినియోగదారులు ఈ బ్యాంకుల ఏటీఎంలలో దేన్నైనా సందర్శించి వారి రీఛార్జిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎయిర్‌టెల్‌ వినియోగదారులు బిగ్ బజార్స్ , అపోలో ఫార్మసీలకు కూడా వెళ్లి వారి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఏటీఎం రీచార్జ్ ఎలా చేసుకోవాలంటే..
► కార్డును ఏటీఎంలలో ఇన్‌సెర్ట్ చేయాలి.
► ఏటీఎం మెషీన్ తెరపై కనిపించే మొబైల్ కంపెనీని ఎంచుకోవాలి.
► రీఛార్జ్ చేయదలిచిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
► రీఛార్జ్ చేసుకునే మొత్తాన్ని నమోదు చేయాలి. తరువాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత ఎంటర్ చేస్తే రీఛార్జ్ పూర్తయిందని నిర్ధారిస్తూ సందేశం వస్తుంది.  రీచార్జ్ చేసుకున్న అమౌంట్ మీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అవుతుంది. అలాగే మీ నెట్‌వర్క్ ఆపరేటర్ నుండి కూడా మెసేజ్ వస్తుంది. ఆన్‌లైన్‌లో రీఛార్జ్  చేసుకోలేని వ్యక్తులకు మాత్రమే ఏటీఎం రీఛార్జ్ సాధ్యమవుతుంది. దీంతోపాటు వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులకు ఎస్ఎంఎస్ రీఛార్జ్ సౌకర్యం కూడా అందుబాటులో వుంది. ముఖ్యంగా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు మాత్రమే ఎస్ఎంఎస్ రీఛార్జ్ ద్వారా చేసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ రీచార్జ్ ఎలా అంటే
మీ నంబర్ నుండి ఐడియా/వొడాఫోన్ నంబరు టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, రీచార్జ్ సొమ్ము టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, ఐసీఐసీఐ, లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతా చివరి ఆరు అంకెలను నమోదు చేసి 9717000002 లేదా 5676782కు ఎస్ఎంఎస్ పంపితే రీచార్జ్ పూర్తవుతుంది.

కాగా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందుల నేపథ్యంలో జియో కూడా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బిఐ, యాక్సిస్ , సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్‌ బ్యాంకుల ఏటీఎంలద్వారా మొబైల్ రీచార్జ్ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే వినియోగదారుల వోడాఫోన్, ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్‌ల వాలిడిటీని ఏప్రిల్ 17వరకు పెంచాయి. తక్కువ ఆదాయ వినియోగదారుల ఖాతాలను రూ.10తో జమ చేశాయి. మరోవైపు రిలయన్స్ జియో కూడా ఏప్రిల్ 17 వరకు 100 కాల్స్ , 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు