రూ.7777 చెల్లిస్తే..ఐ ఫోన్‌ 7 మీ సొంతం

17 Oct, 2017 08:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులను ఆకర్షించటానికి దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌  ఐ ఫోన్‌ 7 పై బంపర్‌ ఆఫర్‌  ప్రకటించింది.    కంపెనీ డిజిటల్‌ ఇన్నోవేషన్‌లో భాగంగా  లాంచ్‌ చేసిన ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా ఐ ఫోన్‌పై ఆకర్షణీయ మైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.  ఇనాగరల్‌  ఆఫర్లో భాగంగా  ఆపిల్ ఐఫోన్ 7 ను ఆకర్షణీయమైన డౌన్ చెల్లింపుల్లో అందిస్తోంది.  ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను  త్వరలోనే  జోడించాలని సంస్థ యోచిస్తోంది.

జియోనుంచి గట్టిపోటీని ఎదుర్కొంటూ, దూకుడు ధరలను ఆఫర్ చేస్తున్న  సంస్థ ఆన్‌లైన్‌ స్టోర్‌ను  లాంచ్‌ చేసింది.  ఇందులో భాగంగా ఫ్లాగ్‌షిప్‌  స్మార్ట్‌ఫోన్లపై సరసమైన డౌన్‌ పేమెంట్స్‌, తక్షణ క్రెడిట్ వెరిఫికేషన్,  ఫైనాన్సింగ్,  నెలసరి ప్రణాళికలను  ప్రవేశపెట్టింది.  ఈ  క్రమంలో  సోమవారం ఆన్ లైన్ స్టోర్‌  ద్వారా ఆపిల్ ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్   వేరియంట్లను జోడించింది.  కేవలం రూ. 7,777 ల డౌన్‌ పేమెంట్‌తో 32 జీబీ  ఐఫోన్‌ను  సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.  మిగిలిన సొ‍మ్మును  24 నెలవారీ వాయిదాలలో రూ. 2,499 ( పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌తో కలిపి) చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తోంది.

అంతేకాదు దీంతోపాటు,  నెలవారీ వాయిదాలలో 30 జీబి డేటా, అపరిమిత కాలింగ్ (స్థానిక, ఎస్‌టీడీ, జాతీయ రోమింగ్) తోపాటు  సైబర్‌ ప్రొటెక్షనతో పాటు  ఫోన్‌ డ్యామేజ్ కవర్‌‌ చేసే ఎయిర్టెల్ సెక్యూర్ ప్యాకేజీ అందించే ప్రత్యేకమైన పోస్ట్ పెయిడ్‌ పధకాన్ని కూడా అందిస్తోంది.

ఐఫోన్‌7  128 జీబీ వేరియెంట్‌కు రూ.16,300 డౌన్‌పేమెంట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ  వేరియంట్‌కు రూ.17,300,  128 జీబీ వేరియంట్‌కు రూ.26వేల డౌన్‌పేమెంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలలకు చెల్లించాల్సి ఉంటుంది.

ఇందుకోసం www.airtel.in/onlinestore కు లాగిన్‌ అయ్యి మొబైల్‌ను ఎంపిక చేసుకోవాలి.   అనంతరం మన ఎలిజిబిలిటీ, రుణ సదుపాయం తదితర అంశాలను పరిశీలించుకోవాలి.  చివరగా మనం ఎంపిక చేసుకున్న మొబైల్‌కు సంబంధించిన డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలి.  లావాదేవీ సక్రమంగా   పూర్తయితే సంబంధిత చిరునామాకు మొబైల్‌ చేరుతుంది.

లక్షలాది మంది  వినియోగదారులని ఆహ్లాదపరిచేందుకు ఎయిర్టెల్  మరో  ఉత్తేజకరమైన డిజిటల్ ఆవిష్కరణను తీసుకొచ్చినట్టు హర్మీన్‌ మెహతా భారతి ఎయిర్‌టెల్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ తెలిపారు.  కస్టమర్లు ఎల్లప్పుడూ కోరుకునే పరికరాలకు అప్గ్రేడ్ చేయడమే కాదు,  డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధునాతనమైన, సరళమైన ప్రక్రియతో వారి కలను సాకారం  చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు  తమ  భాగస్వాములకు కూడా ఆయన  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కాగా ఎయిర్టెల్  ఆన్‌లైన్‌  స్టోర్ సేవలు  భారతదేశంలోని 21 నగరాల్లో ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.   ఆపిల్ ఇంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, క్లిక్స్ కాపిటల్, సెయిన్స్ టెక్నాలజీస్, బ్రైట్‌ స్టార్‌ టెలికమ్యూనికేషన్స్ ,  వుల్కాన్ ఎక్స్‌ప్రెస్‌  సంస్థలతో భాగస్వామ్యంను కలిగి ఉంది.

మరిన్ని వార్తలు