ఎయిర్‌ఇండియా దక్కేది వీరికే..?

27 Jan, 2020 08:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నష్టాలతో సతమతమవుతున్న ఎయిర్‌ఇండియాలో నూరు శాతం వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం సోమవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానిస్తుండటంతో ఎయిర్‌లైన్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎయిర్‌ఇండియాను కొనుగోలుకు మొగ్గుచూపే బయ్యర్లు ఈ ఏడాది మార్చి 17 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు స్పందించాల్సి ఉంటుంది. ఎయిర్‌ఇండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్‌, హిందూజాలు, ఇండిగో, స్పైస్‌జెట్‌ సహా కొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు పోటీ పడవచ్చని భావిస్తున్నారు. మరోవైపు దేశీ విమానయాన సంస్థలతో కలిసి కొన్ని విదేశీ ఎయిర్‌లైన్స్‌ కూడా సంయుక్త బిడ్ల ద్వారా బిడ్డింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకునే అవకాశం ఉంది.

ఎయిర్‌ఇండియా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితులున్నా ఎయిర్‌ఇండియాకు విస్తృతంగా ఉన్న దేశీ, విదేశీ నెట్‌వర్క్‌..లండన్‌, దుబాయ్‌ వంటి కీలక విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్‌ రైట్స్‌, స్లాట్‌లు, సాంకేతిక సిబ్బంది కలిగి ఉండటం, పెద్ద సంఖ్యలో విమానాలు ఉండటంతో కొనుగోలుదారులు టేకోవర్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎయిర్‌లైన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తుండటంతో కొనుగోలుదారులు లేవనెత్తే డిమాండ్లను అంగీకరించి విక్రయ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు పంపుతోందని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఇండియా మాజీ చీఫ్‌ రాజన్‌ మెహ్రా పేర్కొన్నారు. కాగా ఎయిర్‌ఇండియా ప్రస్తుతం రోజుకు సగటును రూ 20-25 కోట్ల నష్టంతో నడుస్తోంది.

చదవండి : బీపీసీఎల్, ఎయిరిండియా విక్రయం 

మరిన్ని వార్తలు