అలహాబాద్‌ బ్యాంక్‌ లాభం 128 కోట్లు

1 Aug, 2019 04:35 IST|Sakshi

తగ్గిన మొండి కేటాయింపుల భారం  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్‌(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఇక గత క్యూ1లో రూ.4,794  కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,747 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,590 కోట్ల నుంచి రూ.1,102 కోట్లకు తగ్గాయని వివరించింది.  

మిశ్రమంగా రుణ నాణ్యత..
బ్యాంక్‌ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. స్థూల మొండి బకాయిలు పెరగ్గా, నికర మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ1లో 15.97 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 17.43 శాతానికి పెరిగాయి.  నికర మొండి బకాయిలు 7.32% నుంచి 5.71%కి చేరాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత క్యూ4లో స్థూల మొండి బకాయిలు 17.55%, నికర మొండి బకాయిలు 5.22%గా ఉన్నాయి.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్‌ 5.6% నష్టంతో రూ.36.85 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు