పీఎన్‌బీ స్కామ్‌ ఆస్తుల అటాచ్‌కు అనుమతించండి

19 Apr, 2018 02:51 IST|Sakshi

ఎన్‌సీఎల్‌ఏటీని అభ్యర్థించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రుణ మోసంతో సంబంధమున్న వ్యక్తుల, సంస్థల ఆస్తుల ను ఆటాచ్‌ చేయడానికి అవకాశమివ్వాలని నేషనల్‌ కంపెనీ లా అప్పిల్లేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ)ను ప్రభుత్వం కోరింది. ఈ స్కామ్‌కు సంబంధించి  ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఎన్‌సీఎల్‌ఏటీకి కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. బకాయిల రికవరీ కోసం, మేనేజ్‌మెంట్‌ తొలగింపుకు సంబంధించిన అధికారాలను కూడా ఇవ్వాలని కోరుతూ సదరు మంత్రిత్వ వాఖ ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. జస్టిస్‌ ఎస్‌. జె. ముఖోపాధ్యాయ అధ్యక్షతన గల ఇద్దరు సభ్యులు గల ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఈ నెల 23న విచారించనున్నది.

 ఈ రుణ స్కామ్‌కు సంబంధించి ఉత్తర్వుల్లో భాగంగా దాదాపు 60 కంపెనీలు, వ్యక్తులు తమ తమ ఆస్తులను విక్రయించకుండా ఎన్‌సీఎల్‌టీ నిషేధం విధించింది. నీరవ్‌ మోదీ, మేహుల్‌ చోక్సి వంటి వ్యక్తులు, గీతాంజలి జెమ్స్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్లు, ఫైర్‌స్టార్‌ డైమండ్‌ వంటి కంపెనీలు, సోలార్‌ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్‌ డైమండ్‌ వంటి భాగస్వామ్య సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు