ఆన్‌లైన్‌లో మళ్లీ టీవీలు, ఫ్రిజ్‌లు

17 Apr, 2020 06:02 IST|Sakshi

20 నుంచి యథాప్రకారం విక్రయాలు

కేంద్ర హోం శాఖ వివరణ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్‌లో విక్రయాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఏప్రిల్‌ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ వంటి ఈ–కామర్స్‌ పోర్టల్స్‌లో మళ్లీ మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉత్పత్తుల అమ్మకం ప్రారంభం కానుంది. మే 3 దాకా పొడిగించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఈ మేరకు వివరణనిచ్చారు. టీవీలు, మొబైల్‌ ఫోన్స్‌ కూడా ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అయితే, ఈ–కామర్స్‌ కంపెనీల డెలివరీ వ్యాన్లు.. రోడ్ల మీదికి రావాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. మార్చి 25న తొలిసారిగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఈ–కామర్స్‌ సంస్థలు కేవలం ఔషధాలు, ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలే విక్రయించడానికి అనుమతినిచ్చారు. సరుకు రవాణా, డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో వారి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణ యం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం ప్రకటించిన మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసింది.

మరిన్ని వార్తలు