ఆయనకు ఒక్కరోజులో రూ.97వేల కోట్ల లాభం

21 Jul, 2020 12:30 IST|Sakshi

అమెజాన్‌ వ్యవస్థాపకుడి రికార్డు

సంపద సృష్టి విషయంలో స్టాక్‌ మార్కెట్‌కు మించిన ప్రత్యామ్నయం ఈ భూమ్మీద మరోకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు అమెజాన్‌ వ్యవస్థాపకుడు సీఈవో జెఫ్ బెజోస్‌. స్టాక్‌ మార్కెట్లో తన కంపెనీ అమెజాన్‌ షేరు పెరగడంతో ఒక్కరోజులో ఏకంగా రూ.97వేల కోట్ల(13 బిలియన్‌ డాలర్లు) సంపదను ఆర్జించగలిగారు. తద్వారా ఒక్కరోజులో అత్యధిక సంపదను సంపాదించిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా పేరుగాంచిన జెఫ్ బెజోస్‌ మొత్తం సంపద 189 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

సంపద పెరిగింది ఇందుకే: వెబ్‌ షాపింగ్‌ ట్రెండ్స్‌పై ఆశావహన అంచనాలతో సోమవారం అమెజాన్‌ షేరుకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే ప్రముఖ రేటింగ్‌ సంపద గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అమెజాన్‌ షేరుకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ... షేరు టార్గెట్‌ ధరను 3100డాలర్ల నుంచి 3800డాలర్లకు పెంచింది. ఫలితంగా అమెజాన్‌ షేరు 2018 డిసెంబర్‌ తర్వాత అత్యధికంగా 7.9 లాభపడింది. షేరు ర్యాలీతో కంపెనీ వ్యవస్థాపకుడు జెజోస్‌ సంపద కూడా ఎగిసింది. ఇదే కంపెనీలో భారీ వాటాలను కలిగి ఉన్న అతని మాజీ భార్య మెకంజీ బెంచ్‌ సంపద సైతం 4.6బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యధికంగా సంపద కలిగిన వ్యక్తుల్లో 13వ స్థానానికి ఎగసింది.

ఈ ఏడాదిలో 74బిలియన్‌ డాలర్ల ఆర్జన: కరోనా ఎఫెక్ట్‌తో అమెరికా ఆర్థిక వ్యవస్థ మహా మాంద్యంలోకి వెళ్లిపోయింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో 56ఏళ్ల ఈ బిలీనియర్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 74బిలియన్‌ డాలర్ల సంపదను ఆర్జించారు. ఇదే సమయంలో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకెన్‌బుర్గ్‌ 15బిలియన్‌ డాలర్లను సంపాదించారు. ఇదే 2020 ఏడాదిలో ఆసియాలో అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ముకేశ్‌ అంబానీ 13.5బిలియన్‌ డాలర్లను ఆర్జించగలిగారు.

మరిన్ని వార్తలు