సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు కస్టమర్లకు సరికొత్త సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఓ వైపు ఆఫర్లు, డిస్కౌంట్లను కొనసాగిస్తూనే డెలివరీ టైమ్ను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నాయి. చిన్న పట్టణాలకూ తన సేవలను విస్తరించాలని భావిస్తున్న ఫ్లిప్కార్ట్ పండుగ సీజన్లోనూ కేవలం ఒకటిన్నర రోజులోనే డెలివరీలను అందిస్తామని హామీ ఇస్తోంది.
ఇక అమెజాన్ కస్టమర్లకు ఫోన్లను టచ్ చేసి సరికొత్త అనుభూతిని అందించేందుకు ఇన్ స్టోర్ డెమో జోన్స్ ఏర్పాటు కోసం టెలికాం కంపెనీలతో భాగస్వామ్యానికి సన్నాహాలు చేస్తోంది. స్మార్ట్ ఫోన్ల ఆన్లైన్ సేల్స్ గణనీయంగా పెరుగుతుండటంతో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లుకు మరిన్ని తాయిలాలు అందించవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆన్లైన్ విక్రయాల వాటా 2019 నాటికి 40నుంచి 50 శాతంగా ఉంటుందని ఫ్లిప్కార్ట్ అంచనా వేస్తోంది.