సంస్థ విలువ సుమారు 30–40 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై అమెరికన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో అమెజాన్ పేమెంట్స్ విభాగం అమెజాన్ పే .. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ట్యాప్జోను కొనుగోలు చేసింది. నగదు, షేర్ల రూపంలో కుదుర్చుకున్న ఈ డీల్తో ట్యాప్జో విలువను 30– 40 మిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ట్యాప్జో కొనుగోలు కోసం ఈ ఏడాది తొలి నుంచీ అమెజాన్ చర్చలు జరుపుతోంది. డీల్ కింద ట్యాప్జో వ్యవస్థాపకుడు అంకుర్ సింగ్లా, ఆయన టీమ్ అంతా కూడా అమెజాన్లో చేరతారని తెలిసింది. అయితే ఈ డీల్ గురించి ఇటు అమెజాన్ గానీ అటు ట్యాప్జో గానీ ధృవీకరించలేదు.
2009లో ఫిర్యాదుల పరిష్కార ఫోరంగా అకోషా పేరుతో ట్యాప్జో ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ సర్వీసును హెల్ప్చాట్ కింద రీ బ్రాండ్ చేశారు. అది కూడా సత్ఫలితాలు సాధించకపోవడంతో ఆల్–ఇన్–వన్ ప్లాట్ఫాం ట్యాప్జో కింద 2016 నవంబర్లో మళ్లీ రీబ్రాండింగ్ చేశారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ తదితర 35 పైచిలుకు యాప్స్ను విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే యాప్లో ఇది అందిస్తోంది. సెకోయా క్యాపిటల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ వంటి ఇన్వెస్టర్ల నుంచి ట్యాప్జో ఇప్పటిదాకా 20 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించింది.
అమెజాన్ బిల్లు చెల్లింపుల సర్వీసులు..
ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ బిల్లులను అమెజాన్ పే వాలెట్ ద్వారా చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తూ అమెజాన్ కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఇందుకోసం విద్యుత్, మొబైల్, బ్రాడ్బ్యాండ్ తదితర విభాగాల సంస్థలతో చేతులు కలిపింది. గడిచిన రెండేళ్లుగా భారత డిజిటల్ పేమెంట్స్ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న అమెజాన్.. ఇప్పటికే పలు స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసింది.
ఈ ఏడాదే డిజిటల్ రుణాల సంస్థ క్యాపిటల్ ఫ్లోట్లో 22 మిలియన్ డాలర్లు, డిజిటల్ ఇన్సూరెన్స్ స్టార్టప్ ’అకో’లో 12 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. డిజిటల్ పేమెంట్ సేవల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్కి చెందిన బెర్క్షైర్ హాథ్వే 3–4 శాతం వాటాల కోసం రూ. 2,200–రూ. 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడి కాగానే.. ట్యాప్జోను అమెజాన్ కొనుగోలు చేసిందన్న వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.