ఆపిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ : అమెజాన్‌తో డీల్‌

10 Nov, 2018 11:27 IST|Sakshi

టెక్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఆపిల్‌ మధ్య కీలక ఒప్పందం

ఐఫోన్స్‌, ఐపాడ్స్‌ ఇక  నేరుగా అమెజాన్‌లో

టెక్‌ దిగ్గజం ఆపిల్‌, అతిపెద్ద ఈ కామర్స్‌  వ్యాపార సంస్థ అమెజాన్‌ కీలక భాగస్వామ్యాన్ని కుదర్చుకున్నాయి. రానున్న హాలిడే షాపింగ్‌ సీజన్‌ దృష్ట్యా తమ మధ్య వైరాన్ని సైతం పక్కన బెట్టి మరీ ఒక  ఒప్పందాన్ని  చేసుకున్నాయి. ఈ మేరకు నవంబరు 9న అమెజాన్‌ ఒక ప్రకటన జారీ చేసింది.  రానున్న వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫాంలో విక్రయిస్తామని తెలిపింది. దీని ప్రకారం ఐఫోన్ ఎక్స్‌ఆర్‌, ఎక్స్‌ఎస్‌,  ఎక్స్‌ఎస్‌ మాక్స్‌లాంటి  తాజా ఆపిల్ ఉత్పత్తులతో పాటు ఐప్యాడ్‌, ఆపిల్‌ వాచ్‌, ఆపిల్‌ టీవీలను అమెజాన్‌ ద్వారా  అందుబాటులోకి తెస్తుంది.

ఇప్పటివరకు థర్డ్‌పార్టీ సెల్లర్‌గా మాత్రమే ఆపిల్‌ ఉత్పత్తులను విక్రయించిన అమెజాన్‌ తాజా ఒప్పందం ప్రకారం నేరుగా వీటిని అమ్మనుంది. దీంతో 2019, జనవరి 4నుంచి ప్రస్తుతం అమెజాన్లో ఆపిల్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ఇతర కంపెనీలు తమ లిస్టింగ్‌లను తొలగించనున్నాయి. అయితే ఇందులో చిన్న మినహాయింపు  కూడా ఉంది.  ఆపిల్‌ హోం ప్యాడ్‌ స్మార్ట్‌ స్పీకర్‌ మాత్రం అమెజాన్‌ సైట్‌లో లభ్యం కాదు.

భారత్‌తోపాటు అమెరికా,  బ్రిటన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, జర‍్మనీ,  ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో ఐఫోన్లు, ఐప్యాడ్లు తదితర ఆపిల్‌ లేటెస్ట్‌ ఉత‍్పత్తులను విక్రయించనున్నట్టు చెప్పింది.  విక్రయాలను పెంచుకునే లక్ష‍్యంతో ఈ డీల్‌ కుదుర్చుకున్నట్టు ఆపిల్‌ వెల్లడించింది.  ఆపిల్ కస్టమర్లకు  మరింత దగ్గరయ్యేందుకు అమెజాన్‌తో కలిసి పనిచేస్తున్నామని ఆపిల్ ప్రతినిధి నిక్ లీ తెలిపారు. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మాక్ తదితర తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యూజర్లకు మరో గొప్ప అవకాశాన్ని అందిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు