ఫ్లిప్‌కార్ట్‌ను కోర్టుకీడ్చిన ఆమ్వే

19 Oct, 2018 13:02 IST|Sakshi

సాక్షి, ముంబై: అమెరికా ఆన్‌లైన్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ డీల్‌ తరువాత  దేశీయంగా దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్‌కు మరో దిగ్గజం ఆమ్వే షాక్‌ ఇచ్చింది. భారతీయ ఇ-కామర్స్ నిబంధనలకు ఇరుద్ధంగా ఫ్లిప్‌కార్ట్‌ తమ ఉత్పత్తులను అనధికారికంగా విక్రయిస్తోందని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సంస్థ ఆమ్వే ఆరోపిస్తోంది. తద్వారా 2016 లో కేంద్రం జారీ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్‌ను  అతిక్రమించిందని వాదించింది. 

ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌  'అనధికార' అమ్మకాలు జరుపుతోందని ఆరోపించింది. ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా  తమ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తోందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కామర్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌ ఉత్పత్తుల లిస్టింకు ముందు కంపెనీల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న భారతదేశ మార్గదర్శకాలను ఫ్లిప్‌కార్ట్‌ ఉల్లంఘిస్తోందని  ఆమ్వే పేర్కొంది. అంతేకాదు తమ ఉత్పత్తుల మూతలపై ముద్రించిన యూనీకోడ్‌, సిల్వర్‌ ఫోయిల్‌ సీల్స్‌ను టాంపర్‌ చేసి మరీ అక్రమ విక్రయాలకు పాల్పడుతోందని ఆమ్వే విమర్శించింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపింది. డైరెక్ట్‌ విక్రయదారుల ప్రయోజనాలు, జీవనోపాధిని కాపాడటం, వ్యాపార ప్రాథమిక పునాదిని కాపాడుకోవడంతోపాటు  వినియోగదారుల భద్రతను కాపాడేందుకు  న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఆమ్వే కోరింది.

గతంలో ఇదే వ్యవహారంలో స్నాప్‌డీల్‌, ఆన్‌లైన్‌ ఫార్మా సంస్థ 1ఎంజీ.కామ్‌పై కేసులు నమోదు చేసింది.  ఈ మేరకు రెండు సంస్థలు ఆమ్వే ఉత్పత్తులను తొలగించాయి. మరి తాజా పరిణామంపై ఫ్లిప్‌కార్ట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మరిన్ని వార్తలు