కరోనా: ‘ఈ మధ్యకాలంలో ఇదే గొప్ప బహుమతి’

13 Mar, 2020 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ: సామాజిక అంశాలపై ఎప్పుడూ ట్విటర్‌లో స్పందించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కోవిడ్‌ 19)పై ఓ మెసేజ్‌ చేశారు. కరోనా నియంత్రణకు ఉపయోగపడే మాస్క్‌ను తన స్నేహితుడు అశోక్‌ కురియన్‌ బహుకరించాడని ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఈ మధ్య కాలంలో తనకు వచ్చిన అద్భుతమైన బహుమతి ఇదేనని పేర్కొన్నారు. ఈ మాస్కును భారతీయుల కృషితో  లివింగ్‌ గార్డ్‌ అనే స్విస్‌ కంపెనీ రూపొందించిందని తెలిపారు. ఎలాంటి వైరస్‌లనైనా నివారించే విధంగా మాస్కులు తయారు చేశారని కొనియాడారు.

దేశంలో మాస్క్‌ల ఉత్పతి పెంచడానికి లివింగ్‌ గార్డ్‌ కంపెనీ ప్రణాళిక రచిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వరకు దేశవ్యాప్తంగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య 1,35,809కి చేరడం ఆందోళనకరం. ఇదిలాఉండగా.. కర్ణాటకలోని కలబుర్గి ప్రాంతానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ సిద్ధఖీ (76) ఈ ప్రాణాంతక వైరస్‌ బారినపడి బుధవారం ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో ఇదే తొలి కరోనా మరణం.

చదవండి: ‘40 ఏళ్ల క్రితం బాగానే అనిపించింది.. కానీ..’

మరిన్ని వార్తలు