ప్రముఖ ఆటో కంపెనీ ఎంట్రీ : ఓలా, ఉబెర్‌కు చెక్?

2 Mar, 2020 11:20 IST|Sakshi

క్యాబ్‌ సర్వీసుల్లోకి ఎం అండ్‌ ఎం

త్వరలోనే ‘అలైట్‌’యాప్‌ ఆవిష్కారం

కార్పొరేట్‌ సేవలు, క్రమంగా కాల్‌ ఆన్‌ సేవలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ఎం) క్యాబ్ అగ్రిగేటర్, షేర్డ్ మొబిలిటీ సర్వీసుల రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ప్రధానంగా కార్పొరేట్ల కోసం ‘అలైట్’ అని పిలిచే క్యాబ్ అగ్రిగేటర్‌ను ప్రారంభించనుంది. రాబోయే రెండు-మూడు సంవత్సరాలలో అలైట్‌ సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని ఆనంద్‌ మహీంద్ర నేతృత్వంలోని ఎం అండ్‌ ఎండ్‌ ప్లాన్‌ చేస్తోంది. తద్వారా ఇప్పటికే ఈ రంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు ఓలా, ఉబర్‌లకు ప్రత్యక్షంగా గట్టి పోటీ ఇవ్వనుంది.

క్యాబ్‌ సర్వీసుల నిర్ణయంతో పాటు, తన మొబిలిటీ వ్యాపారాలన్నింటినీ  ఏకం చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఎం అండ్‌ ఎం. అలైట్ (ప్రస్తుతం మహీంద్రా లాజిస్టిక్స్), మేరూ క్యాబ్స్ (మెజారిటీ షేరు ఉన్న ఎం అండ్‌ ఎం) , గ్లైడ్ (ఎం అండ్‌ ఎం ఇ-వెహికల్ క్యాబ్ సర్వీస్), ఫస్ట్ ఛాయిస్  యూజ్డ్‌ కార్ల బిజినెస్‌) ఇలా అన్నీ మొబిలిటీ సర్వీసులను  (అలైట్‌) ఒకే గొడుగు కిందికి  తీసుకురానుంది. ఇందుకోసం ‘అలైట్’ పేరుతో ఒకయాప్‌ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ త్రైమాసికం నుండి దేశవ్యాప్తంగా తమ బ్రాండ్‌ను పరిచయం చేయనున్నామని మహీంద్రా లాజిస్టిక్స్ సీఈవో రాంప్రవీణ్‌ స్వామినాథన్ చెప్పారు. వివిధ సంస్థలతో ఒప్పంద ప్రాతిపదికన  ఇది పని చేస్తుందని  తెలిపారు. 

ప్రాథమికగా కంపెనీ ఉద్యోగులను ఆఫీసులనుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసులకు, లేదా వివిధ కాన్ఫరెన్సులు, స​మావేశాలకు, విమానాశ్రయాలకు తీసుకెళ్లే సేవలు ఉంటాయి. క్రమంగా ఈ సేవలను కాల్‌-ఆన్ సేవలుగా విస్తరించనుంది. ఓలా కార్పొరేట్ ఫీచర్ ద్వారా కార్పొరేట్ టాక్సీ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో సంస్థ ఉబెర్ కూడా ఉబెర్ ఫర్ బిజినెస్ ఫీచర్ ద్వారా ఈ విభాగంలోకి ఇటీవల ప్రవేశించింది.  దాదాపు 10వేల కంపెనీలు ప్రస్తుతం ఓలా కార్పొరేట్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. అయితే ఓలా, ఉబెర్‌ బీటూ సీ సేవలతో పోలిస్తే కార్పొరేట్ భాగస్వామ్యాలతో బీ టూ బీ సేవలతో అలైట్  భిన్నంగా వుంటుందని కంపెనీ వెల్లడించింది. 

చదవండి: జీఎస్‌టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే!

మరిన్ని వార్తలు