పీఎంసీ స్కామ్‌ : మరో డిపాజిటర్‌ మృతి

31 Oct, 2019 15:46 IST|Sakshi

ముంబై : పీఎంసీ బ్యాంక్‌ కుంభకోణం మరో డిపాజిటర్‌ను బలితీసుకుంది. తన కష్టార్జితం దాచుకున్న బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన కేష్ముల్‌ హిందుజా గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈనెల 29న గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన 68 ఏళ్ల హిందుజా మరుసటి రోజు మరణించారని ఆయన కుమార్తె చెప్పారు. తన తండ్రికి ఇతర అనారోగ్యం ఏమీ లేదని, పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభంపై తీవ్ర ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. ముంబైలోని ములుంద్‌ ప్రాంతంలో హిందుజా కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడని ఆమె చెప్పారు. అయితే బ్యాంకులో ఆయనకు ఎంత సొమ్ము డిపాజిట్‌గా ఉందన్నది తనకు తెలియదని ఆయన కుమార్తె పేర్కొన్నారు. పీఎంసీ బ్యాంక్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత హిందుజా మరణంతో ఇప్పటివరకూ బ్యాంక్‌ బాధితులు ఏడుగురు మరణించడం గమనార్హం.

మరిన్ని వార్తలు