ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌తో అపోలో హాస్పిటల్స్ జట్టు

15 Jul, 2014 00:52 IST|Sakshi
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌తో అపోలో హాస్పిటల్స్ జట్టు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ తాజాగా దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద భారత్‌లో ఉన్న అపోలో హాస్పిటల్స్‌కి చికిత్స కోసం మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే పేషంట్లు, వారి సహాయకులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్.. విమాన చార్జీలపై ప్రత్యేక డిస్కౌంటు ఇస్తుంది. హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరులో ఉన్న అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స పొందేందుకు వచ్చే మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని 19 దేశాల వారికి ఇది వర్తిస్తుంది.
 
ఈ ఆఫర్ కింద రిటర్న్ టికెట్లపై బిజినెస్ తరగతి ప్రయాణికులకు ఆరు శాతం మేర, ఎకానమీ తరగతిలో ప్రయాణించే వారికి నాలుగు శాతం దాకా చార్జీలు ఆదా కాగలవని సంస్థలు పేర్కొన్నాయి. అలాగే, భారత్‌లోని నిర్దిష్ట ప్రాంతాలకి సంబంధించి చేసుకునే బిజినెస్ క్లాస్ బుకింగ్స్‌పై 10 శాతం దాకా, ఎకానమీ క్లాస్ బుకింగ్స్‌పై అయిదు శాతం దాకా ఆదా కానుంది.
 
ఇథియోపియా, ఘనా తదితర ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పటికీ మెరుగైన వైద్య సేవలు లభించడం కష్టమేనని, దీంతో ఆయా దేశాల వారికి కూడా అత్యాధునిక చికిత్సను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తాము ఈ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అపోలో హాస్పిటల్స్ సీఈవో కె. హరిప్రసాద్ తెలిపారు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు ప్రయాణించే అపోలో హాస్పిటల్స్ కస్టమర్లందరూ కూడా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ నుంచి ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారు ఎమిరేట్స్ వెబ్‌సైట్లో ఉండే పాస్‌కోడ్‌ను ఉపయోగించి ప్రత్యేక డిస్కౌంటును పొందవచ్చు.

మరిన్ని వార్తలు