లక్ష రూపాయల ఫోన్‌: నిమిషాల్లోనే విక్రయం

4 Nov, 2017 09:58 IST|Sakshi

ఐఫోన్‌ 10 ఏళ్ల వార్షికోత్సవంగా ఆపిల్‌ తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఈ ఫోన్‌ శుక్రవారం విక్రయానికి వచ్చింది. విక్రయానికి వచ్చిన ఈ ఫోన్‌ కోసం వినియోగదారులు ఎగబడ్డారు. దేశంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్‌ సర్వీసు ప్రొవైడర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తన ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను విక్రయించింది. సాయంత్రం ఆరు గంటలకు దీన్ని విక్రయానికి తీసుకురాగ, నిమిషాల వ్యవధిలోనే స్టాక్‌ అంతా అమ్ముడుపోయింది. పైగా ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా పోస్ట్‌-పెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌లో, మొత్తం పేమెంట్‌ చేసిన వారికి ఈ ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ విక్రయించింది. 

ఈ ఫోన్‌ ధర రూ.89వేల నుంచి లక్ష రూపాయలకు పైగ ఉంది. సిటీ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను ఎయిర్‌టెల్‌ అందించింది. ''ఎయిర్‌టెల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌పై తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌ ప్రారంభ సేల్‌లో నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయింది. తాజా స్టాక్‌ వచ్చిన తర్వాత ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు నోటిఫై చేస్తుంది'' అని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్‌ స్టోర్‌లన్నీ శుక్రవారం ఐఫోన్‌ అభిమానులతో కిటకిటలాడాయి. ఐఫోన్‌ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఫోన్‌ రావడంతో ఆపిల్‌ అభిమానులు తెగ ఆసక్తి చూపారు. ఆసియా, యూరప్‌లలో కూడా ఇదే రకమైన స్పందన కనిపించినట్టు తెలిసింది. శుక్రవారం ఆపిల్‌ షేర్లు రికార్డు స్థాయిలను తాకాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా 890 బిలియన్‌ డాలర్ల దగ్గరకు చేరుకుంది.   

మరిన్ని వార్తలు