భారత్‌లో ఆపసోపాలు పడుతున్న టెక్‌ దిగ్గజం

16 Jul, 2018 16:42 IST|Sakshi
పడిపోతున్న ఐఫోన్‌ విక్రయాలు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ  : భారత్‌లో ఐఫోన్లను విక్రయించడానికి టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఆపసోపాలు పడుతోంది. ఇటీవల వారాల్లో ముగ్గురు కీలక ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడటంతో ఆపిల్‌ ఈ క్లిష్టతర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిసింది. భారత్‌లో ఆపిల్‌, తన వైభవాన్ని కోల్పోతుందని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు వెల్లడించింది. చైనాలో నెలకొన్న మాదిరి భారత్‌లోనూ పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపింది. ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాతో, ఆపిల్‌ తన దేశీయ సేల్స్‌ టీమ్‌ను పునర్వ్యస్థీకరించే పనిలో పడింది. 

ఆపిల్‌ ఇండియా నేషనల్‌ సేల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ చీఫ్‌, కమర్షియల్‌ ఛానల్స్‌, మిడ్‌-మార్కెట్‌ బిజినెస్‌ అధినేత, టెలికాం క్యారియర్‌ సేల్స్‌ హెడ్‌ అందరూ కంపెనీని వీడినట్టు బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు పేర్కొంది. అయితే వీరందరూ ఎందుకు కంపెనీని వీడారో మాత్రం ఇంకా క్లారిటీ తెలియరాలేదు. అయితే భారత్‌ మార్కెట్‌లో ఆపిల్‌ ప్రదర్శనే వీరి రాజీనామాల రియాక్షన్‌ అని రిపోర్టు చెబుతోంది. ప్రస్తుతం భారత సేల్స్‌ టీమ్‌ను ఆపిల్‌ పునర్వ్యస్థీకరిస్తోంది. 

కాగ, భారత్‌ రెండింతలు మేర టారిఫ్‌లను పెంచడంతో, ఆపిల్‌ కంపెనీ సైతం తన ధరలను పెంచేసింది. ఈ ప్రభావంతో భారత్‌ మార్కెట్‌లో ఆపిల్‌ తన షేరును కోల్పోతుంది. ఆపిల్‌ కిందకి పడిపోతుంటే, చైనీస్‌ దిగ్గజం షావోమి, కొరియా దిగ్గజం శాంసంగ్‌లు మాత్రం భారత మార్కెట్‌ షేరును అంతకంతకు పెంచుకుంటూ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. 2018 ప్రథమార్థంలో కూడా ఐఫోన్‌ ఇండియా విక్రయాలు కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. ఒకవేళ ద్వితీయార్థంలో జంప్‌ చేసినా.. గతేడాది కంటే తక్కువ విక్రయాలనే నమోదు చేయవచ్చని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం దేశీయంగా పాత ఐఫోన్ల తయారీ ప్రారంభించింది. ఓ వైపు దేశీయంగా తయారీ చేపట్టినా.. దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆపిల్‌ మరింత కృషిచేయాలని విశ్లేషకులంటున్నారు. 

మరిన్ని వార్తలు