డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్‌ వచ్చేస్తోంది..!

19 Apr, 2018 19:53 IST|Sakshi
ఆపిల్‌ ఐఫోన్‌ (ఫైల్‌ ఫోటో)

ఆపిల్‌ ఈ ఏడాది మూడు ఐఫోన్‌ మోడల్స్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త ఫోన్ల తయారీ కూడా ఆపిల్‌ ప్రారంభించింది. ఈ ఫోన్లపై గత కొంత కాలంగా వస్తున్న రిపోర్టుల బట్టి రెండు ఐఫోన్‌ మోడల్స్‌ ఓలెడ్‌ డిస్‌ప్లేతో, మూడో ఐఫోన్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. అయితే తాజాగా కేజీఐ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు మింగ్‌-చి కువో రిపోర్టు ప్రకారం ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగిన ఐఫోన్‌ స్క్రీన్‌ సైజు 6.1 అంగుళాలు ఉంటుందని సమాచారం. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌తోనే ఆపిల్‌ డ్యూయల్‌ సిమ్‌ సపోర్టును అందిస్తుందని రిపోర్టు పేర్కొంది. ఓలెడ్‌ డిస్‌ప్లే ఐఫోన్ల కంటే కూడా ఈ ఐఫోనే తక్కువగా ఉంటుందని కువో అంచనా వేస్తున్నారు. 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లాంచ్‌ అవుతుందని కువో చెబుతున్నారు. దీనిలో ఒకటి సింగిల్‌ సిమ్‌ సెటప్‌ కాగ, మరొకటి డ్యూయల్‌ సిమ్‌ సపోర్టును అందిస్తుందని తెలిపారు.  డ్యూయల్‌ సిమ్‌ మోడల్‌ ఫోన్‌ 6.5 అంగుళాల స్క్రీన్‌తో రూపొందబోతోందని సమాచారం.

ధర పరంగా సింగిల్‌ సిమ్‌ ఐఫోన్‌ ధర 550 డాలర్ల నుంచి 650 డాలర్ల రేంజ్‌లో ఉంటుందని టాక్‌. అంటే భారత్‌లో రూ.36వేల నుంచి రూ.42వేలలో ఉండనుంది. మరోవైపు డ్యూయల్‌ సిమ్‌ మోడల్‌ ధర ఎలాగైనా ఎక్కువగానే ఉంటుందని కువో రిపోర్టు చెబుతోంది. అంటే 650 డాలర్ల నుంచి 750 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.42వేల నుంచి రూ.50వేల వరకు అందించవచ్చని తెలుస్తోంది. అయితే ఆపిల్‌ తీసుకురాబోతోన్న సింగిల్‌ సిమ్‌ మోడల్‌ చైనా, ఇతర వాణిజ్య మార్కెట్లలో మార్కెట్‌ షేరును పెంచడానికి దోహదం చేస్తుందని కువో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్‌ను 100 మిలియన్ల నుంచి 120 మిలియన్ల యూనిట్ల విక్రయాలు చేపట్టాలని ఆపిల్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కువో చెప్పారు.  

మరిన్ని వార్తలు